అన్నా మెచ్చుకుంటే.. కేజ్రీవాల్ తిట్టారు!
కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడాన్ని అవినీతికి వ్యతిరేకంగా పోరాటం సాగించిన అన్నా హజారే మెచ్చుకుంటే.. ఆయన శిష్యుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రం విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడాన్ని అవినీతికి వ్యతిరేకంగా పోరాటం సాగించిన అన్నా హజారే మెచ్చుకుంటే.. ఆయన శిష్యుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రం విమర్శించారు. నల్లధనాన్ని, అవినీతిని, ఉగ్రవాదాన్ని అరికట్టడానికి ఇది చాలా విప్లవాత్మకమైన చర్య అని అన్నా హజారే వ్యాఖ్యానించారు. అయితే, కేవలం ఈ నోట్లను రద్దు చేయడం వల్ల నల్లధనం సమస్య ఏమీ తీరిపోదని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ, దాని మిత్రపక్షాల వాళ్లకు వారం రోజుల ముందుగానే ఈ నోట్ల రద్దు విషయాన్ని చెప్పేశారని, వాళ్లంతా జాగ్రత్త పడిన తర్వాతే ప్రధాని ప్రకటించారని ఆయన ఆరోపించారు.
ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు నిధులు ఇచ్చే సంస్కృతిపై అన్నా హజారే స్పందించారు. ఇప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఇక రాజకీయాలను ప్రక్షాణల చేయడానికి కార్యాచరణ మొదలుపెట్టాలని ఆయన సూచించారు. ఎన్నికలు, రాజకీయాల్లో కూడా నల్లధనాన్ని పూర్తిగా అరికట్టాలని, ఇది ప్రభుత్వానికి పెద్ద సవాలే అవుతుందని ఆయన అన్నారు. వచ్చే సంవత్సరం ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. పెద్ద ఎత్తున ఎన్నికల సంస్కరణలు తీసుకురావాలని తెలిపారు. దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ పెద్ద మొత్తాల్లో విరాళాలు తీసుకుంటాయని, కానీ ఆదాయపన్ను అధికారుల దాడుల నుంచి తప్పించుకోడానికి దాతల పేర్ల మీద రసీదులు ఇస్తుంటారని ఆయన ఆరోపించారు. కొత్త కరెన్సీ నోట్లు కూడా నల్ల కుబేరుల చేతుల్లో పడకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.