ఇక పీఎఫ్‌ వడ్డీ రేటు 8.65 శాతం

8 65 Per Cent Interest On EPF To Be Notified Soon Santosh Gangwar - Sakshi

న్యూఢిల్లీ: ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్‌) ఖాతాదారులకు కేంద్రం శుభవార్త అందించింది. 2018–19 సంవత్సరానికిగాను చేపట్టే చెల్లింపులకు 8.65 శాతం వడ్డీ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇది ప్రస్తుతం చెల్లిస్తున్న వడ్డీరేటు 8.55 శాతంతో పోలిస్తే 0.10 శాతం ఎక్కువ. ఈ పెంపుతో 6 కోట్ల మంది ఈపీఎఫ్‌ ఖాతాదారులకు లబ్ధి చేకూరనుంది. త్వరలోనే వడ్డీరేట్ల పెంపునకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తామని శుక్రవారం ఢిల్లీలోని ఫిక్కీ కార్యాలయంలో ప్రైవేటు సెక్యూరిటీ సంస్థల ప్రతినిధులతో సమావేశం అనంతరం కార్మికశాఖ మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పేర్కొన్నారు. 2015–16 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌ వడ్డీరేట్లు 8.8 శాతం ఉండగా అప్పటి పరిస్థితుల రీత్యా వాటిని క్రమంగా ఐదేళ్ల కనిష్టమైన 8.55 శాతానికి తగ్గించారు. ఈపీఎఫ్‌ఓ అంచనాల ప్రకారం 2018–19 సంవత్సరానికి వడ్డీరేటును 8.65 శాతం ఉంచితే 151 కోట్ల రూపాయల మిగులు ఉండనుంది. అదే 8.7 శాతానికి పెంచితే 158 కోట్ల ద్రవ్యలోటు ఉండనుంది. దీంతో వడ్డీరేటును 8.65 శాతానికి పెంచడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్‌ఎస్‌) సమ్మతించింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top