breaking news
employ provident fund
-
పీఎఫ్ నుంచి 3 వేల కోట్ల విత్డ్రాయల్స్..
కరోనా వైరస్పరమైన ఆర్థిక సమస్యలను గట్టెక్కేందుకు గత రెండు నెలల్లో దాదాపు 12 లక్షల మంది వేతనజీవులు ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) నుంచి సుమారు రూ. 3,360 కోట్ల మేర నిధులను ఉపసంహరించుకున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేవై) ప్యాకేజీ కింద ఈపీఎఫ్వో 12 లక్షల క్లెయిమ్స్ను సెటిల్ చేసినట్లు తెలిపారు. లాక్డౌన్ సమయంలో ఆర్థిక కష్టాలు అధిగమించేందుకు 2.2 కోట్ల మంది నిర్మాణ రంగ కార్మికులకు రూ. 3,950 కోట్లు చెల్లించినట్లు మంత్రి వివరించారు. -
ఇక పీఎఫ్ వడ్డీ రేటు 8.65 శాతం
న్యూఢిల్లీ: ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్) ఖాతాదారులకు కేంద్రం శుభవార్త అందించింది. 2018–19 సంవత్సరానికిగాను చేపట్టే చెల్లింపులకు 8.65 శాతం వడ్డీ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇది ప్రస్తుతం చెల్లిస్తున్న వడ్డీరేటు 8.55 శాతంతో పోలిస్తే 0.10 శాతం ఎక్కువ. ఈ పెంపుతో 6 కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులకు లబ్ధి చేకూరనుంది. త్వరలోనే వడ్డీరేట్ల పెంపునకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తామని శుక్రవారం ఢిల్లీలోని ఫిక్కీ కార్యాలయంలో ప్రైవేటు సెక్యూరిటీ సంస్థల ప్రతినిధులతో సమావేశం అనంతరం కార్మికశాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ పేర్కొన్నారు. 2015–16 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీరేట్లు 8.8 శాతం ఉండగా అప్పటి పరిస్థితుల రీత్యా వాటిని క్రమంగా ఐదేళ్ల కనిష్టమైన 8.55 శాతానికి తగ్గించారు. ఈపీఎఫ్ఓ అంచనాల ప్రకారం 2018–19 సంవత్సరానికి వడ్డీరేటును 8.65 శాతం ఉంచితే 151 కోట్ల రూపాయల మిగులు ఉండనుంది. అదే 8.7 శాతానికి పెంచితే 158 కోట్ల ద్రవ్యలోటు ఉండనుంది. దీంతో వడ్డీరేటును 8.65 శాతానికి పెంచడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) సమ్మతించింది. -
‘ఉపాధి’ ఈపీఎఫ్ ఊసేది ?
నెల్లూరు(పొగతోట), న్యూస్లైన్: నెలానెలా జీతంలో ఈపీఎఫ్ (ఎంప్లాయీ ప్రావిడెండ్ ఫండ్)కట్ అవుతున్నా ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఇది ఒక నెల, రెండు నెలల సమస్య కాదు. రెండేళ్లుగా కొనసాగుతోంది. కమిషనర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్(సీఆర్డీ) అధికారుల నిర్లక్ష్యంతో జాతీయ ఉపాధి హామీ పథకం ఉద్యోగులు నష్టపోతున్నారు. ఈ పథకంలో భాగంగా జిల్లాలో వివిధ విభాగాల్లో 9 వేల మంది పనిచేస్తున్నారు. వీరిలో వెయ్యి మంది ఏపీఓలు, 3 వేల మంది కంప్యూటర్ ఆపరేటర్లు, 4,500 మంది టెక్నికల్ అసిస్టెంట్లు, ఈసీలు, హెచ్ఆర్ , ప్లాంటేషన్ మేనేజర్లు 500 మందికి పైగా ఉన్నారు. వీరందరి జీతం నుంచి నెలనెలా 12 శాతం చొప్పున కట్ ఆవుతోంది. వారి పేర్ల మీద సీఆర్డీ అధికారులు ఖాతాలు తెరిచి ఆ మొత్తంతో పాటు ప్రభుత్వ వాటాగా మరో 10 శాతం జమ చేయాల్సి ఉంది. ఈ మొత్తాన్ని వడ్డీతో కలిపి ఉద్యోగులకు చెల్లించాలి. ఈ 9 వేల మంది ఉద్యోగులకు ఇప్పటివరకు ఈపీఎఫ్ ఖాతాలు తెరవకపోవడం దురదృష్టకరం. ఏపీఓల జీతం నుంచి ప్రతి నెలా రూ.1,300 వరకు కట్ అవుతోంది. వివిధ స్థాయిలో పనిచేస్తున్న మిగిలిన ఉద్యోగుల జీతంలో నుంచి కూడా 12 శాతం మొత్తం కట్ అవుతూనే ఉంది. 2011 నుంచి ఇప్పటి వరకు వీరి జీతాల్లో నుంచి సుమారు రూ.40 కోట్లకు పైగా కట్ చేశారు. ఈ మొత్తాన్ని మరో అకౌంట్లో జమ చేస్తున్నామని సీఆర్డీ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. సాధారణంగా ఈపీఎఫ్ అకౌంట్ ఉంటే బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. అవి లేకపోవడంతో ఉద్యోగులు రుణాలకు నోచుకోవడం లేదు. మూడేళ్లుగా ఖాతాలు తెరవకుండా సీఆర్డీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో గతంలో ఉద్యోగులు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ఇది గమనించిన అధికారులు వెంటనే ఈపీఎఫ్ అకౌంట్లు ప్రారంభిస్తామని హామీ ఇచ్చినా ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. మరోవైపు ఉపాధి హామీ పథకం నుంచి రాజీనామా చేసిన పలువురు వేరే శాఖల్లో ఉద్యోగాలు పొంది చేరిపోతున్నారు. ఇలాంటి వారు రాష్ట్రంలో వంద మందికిపైగా ఉన్నారు. నెల్లూరులో టీఏలు పనిచేసిన శాంతి, శివరంజని, వేణు, సునిత, సూర్యనారాయణ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఖాతాలే లేకపోవడంతో వీరికి చివరలో ఈపీఎఫ్ మొత్తం లభించలేదు. వెంటనే ఈపీఎఫ్ అకౌంట్స్ ప్రారంభించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టేందుకు ఉద్యోగులు సిద్ధమవుతున్నారు.