‘గవ్వలసరి’ అయ్యేనా..?

Tribals demanding for gavvala siri project - Sakshi

ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం స్పందించాలంటున్న గిరిజనం

సాగర్‌ బ్యాక్‌వాటర్‌కు అనుసంధానంగా నిర్మాణం

పొగిళ్ల సమీపంలోని లోతట్టు ప్రాంతంలో ఏర్పాటు

పూర్తయితే తీరనున్న సాగునీటి ఇబ్బందులు

పొగిళ్ల..చందంపేట మండలంలోని ఓ మారుమూల పల్లె.  అక్కడ అంతా గిరిజనులే. భూమి ఉంది..పక్కనే కృష్ణానది జల సవ్వడులు. కానీ సాగునీరు లేదు. తాగేందుకూ దొరకని పరిస్థితి. దీనిని అధిగమించేందుకు బ్యాక్‌వాటర్‌నుంచి నీటిని తీసుకునేందుకు ప్రతిపాదించిన ప్రాజెక్టే గవ్వలసరి. కానీ ఇది ప్రతిపాదనలకే పరిమితం కావడంతో గిరిజనులు వలసబాట పడుతున్నారు.    – చందంపేట     

చందంపేట (దేవరకొండ) : చుట్టూ ఆకుపచ్చని వర్ణం... పక్కనే కృష్ణమ్మ పరవళ్లు... గిరిజన సంస్కృతి... ఇవన్నీ గవ్వలసరి గ్రామం సొంతం... కానీ ఈ ప్రాంతంలో వలసలు తప్పడం లేదు... ఉన్న ఇళ్లు, పొలా లను వదులుకొని ఇతర ప్రాంతాలకు గిరిజనులు వలసపోతున్నారు. ఇందుకు కారణం సాగు, తాగునీరు అందకపోవడమే. జిల్లాలోనే మారుమూల గిరిజన ప్రాంతం చందంపేట. సు మారు 90 శాతం మంది గిరిజనులే ఉన్నారు. ఈ ప్రాంతంలో గిరిజనులంతా వ్యవసాయాన్నే నమ్ముకొని జీవనం సాగిస్తుం టారు. వ్యవసాయ సాగుకు నీరు లేకపోవడం, వర్షాలు సంవృద్ధిగా కురువకపోవడంతో చేసిన అప్పులు తీర్చలేక మళ్లీ అప్పులు చేయలేక పొట్ట చేతపట్టుకొని వలసబాటపడుతున్నారు. నాగార్జునసాగర్‌ వెనుక జలాలను ఆనుకొని ఉన్న ఈ ప్రాంతంలో సాగు, తాగు నీరు అందకపోవడంతో ఒక్కో రైతు సుమారు పదికి పైగా బోర్లు వేసి నీరు పడకపోవడంతో అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నాడు. దీనికి ప్రత్యామ్నాయ మార్గమైన గవ్వలసరి ప్రాజెక్టును నిర్మిస్తే మూడు వేల ఎకరాలకు సాగు, తాగునీరు అందుతుందని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నా రు. గత ఏడాది ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ పొగి ళ్ల స రిహద్దుల్లోని నాగార్జునసాగర్‌ వెనుక జలాల్లో మరబోటులో ప్ర యాణించి అక్కడి పరిస్థితులను స్వయంగా తెలుసుకున్నారు.

గవ్వలసరియే ప్రత్యామ్నాయం
పొగిళ్ల గ్రామ సమీపంలోని లోతట్టు ప్రాంతంలో గవ్వలసరి వద్ద కృష్ణా బ్యాక్‌ వాటర్‌ ప్రవహిస్తుంది. ఏడాది పొడవునా ఈ ప్రవాహం కొనసాగుతుంది. ఈ ప్రాంతంలోనే గవ్వలసరి ప్రాజెక్టు నిర్మించాలనే ప్రతిపాదనలుఉన్నాయి. గవ్వలసరి ప్రాజెక్టు నుంచి పొగిళ్ల, రేకులవలయం, ఉస్మాన్‌కుంట, కంబాలపల్లి, గువ్వలగుట్ట, మంగళితండా, సర్కిల్‌తండా, చౌటుట్ల, చాపలగేటు, యల్మలమంద, దేవరచర్ల, యాపలపాయతండా, రేకులగడ్డ, నేరుట్ల, మంగళితండా, పెద్దమ్మగడ్డతం డా, బిల్డింగ్‌తండా, కాచరాజుపల్లి గ్రామాల్లోని ఆయా చెరువులకు నీటిని అందించి అక్కడ ఆ ప్రాంతాల్లో ఉన్న కరువును పారదోలేందుకు గవ్వలసరి ప్రాజెక్టు ఒక్కటే ప్రత్యామ్నాయం.

అసెంబ్లీ సమావేశాల్లో  ప్రస్తావన
ఇదే విషయమై గత శీతాకాల సమావేశాల్లో కూడా ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ సభ దృష్టికి తీసుకొచ్చారు. సీఎం కేసీఆర్, భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరిశ్‌రావు దృష్టికి కూడా ఎమ్మెల్యే తీసుకెళ్లారు. వారు కూడా ప్రాజెక్టు నిర్మాణానికి సానుకూలంగా ఉన్నారని పలు సభల్లో, సమావేశల్లో కూడా ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ప్రభుత్వం సానుకూలంగా ఉంది
గవ్వలసరి ప్రాజెక్టు కోసం నా శాయశక్తులా కృషి చేస్తున్నాను. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంత రైతులకు సాగు నీటికి ఇబ్బందులు తీరతాయి. వ్యవసాయన్నే నమ్మకున్న రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది. ప్రభుత్వం కూడా గవ్వలసరి ప్రాజెక్టు పట్ల సానుకూలంగా ఉంది.   – రమావత్‌ రవీంద్రకుమార్, ఎమ్మెల్యే

Read latest Nalgonda News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top