చంద్రబాబు సర్కారుపై భగ్గుమన్న గిరిజన నేతలు | Tribal leaders angry with Chandrababu Naidu government | Sakshi
Sakshi News home page

చంద్రబాబు సర్కారుపై భగ్గుమన్న గిరిజన నేతలు

Jul 24 2026 5:13 AM | Updated on Jul 24 2026 5:13 AM

Tribal leaders angry with Chandrababu Naidu government

మాట్లాడుతున్న పుష్పశ్రీవాణి, రాజన్నదొర, ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, బాలరాజు. చిత్రంలో మాజీ ఎంపీ మాధవి తదితరులు

గిరిజన హక్కులను కాలరాస్తే ఏజెన్సీ తిరగబడుతుంది

గిరిజన యువతపై అక్రమ కేసులు బనాయిస్తే సహించేదిలేదు 

జీవో–3 పునరుద్ధరణ కోసం వైఎస్సార్‌సీపీ రివ్యూ పిటిషన్‌ 

వేయలేదనడం పచ్చి అబద్ధం 

మాజీ డిప్యూటీ సీఎంలు పుష్ప శ్రీవాణి, రాజన్నదొర, ఎమ్మెల్యే మత్స్యలింగం, వైఎస్సార్‌సీపీ నేతలు

సాక్షి, విశాఖపట్నం: గిరిజనుల పట్ల చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న విధానాలపై గిరిజన నేతలు భగ్గుమన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల రాజ్యాంగ, చట్టబద్ధమైన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉండాల్సిన కూటమి ప్రభుత్వం అబద్ధాల ప్రచారంతో కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో జీవో–3ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం, రెండేళ్ల పాలన పూర్తయినా ఇప్పటివరకు ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు.

గిరిజన యువత స్వచ్ఛందంగా చేపడుతున్న ఉద్యమాలపై అక్రమ కేసులు బనాయిస్తూ గొంతునొక్కే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో–3 పునరుద్ధరణ కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై నిందలు వేయడం సిగ్గుచేటని, గత ప్రభుత్వంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ వివరాలను బహిర్గతం చేశారు. ఇప్పటికైనా జీవో–3పై ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చంద్రబాబు ప్రభుత్వా­న్ని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో గిరిజనుల తరఫున పోరాటం తప్పదని హెచ్చరించారు. 

గురువారం మద్దిలపాలెంలో మాజీ డిప్యూటీ సీఎంలు పాముల పుష్ప శ్రీవాణి, పీడిక రాజన్నదొర, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, ఏపీ ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ డీవీజీ శంకరరావు, మాజీ ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, శోభా హైమావతి, విశ్వాసరాయి కళావతి, నాగులపల్లి ధనలక్ష్మి, జీసీసీ మాజీ చైర్మన్‌ శోభా స్వాతిరాణి మీడియాతో మాట్లాడారు. వారేమన్నారంటే..

వైఎస్సార్‌సీపీ హయాంలోనే రివ్యూ పిటిషన్‌
‘ఎన్నికల ముందు గిరిజనులకు ఇచ్చిన హామీలకు బొందపెట్టి కల్లబొల్లి మాటలతో చంద్రబాబు కాలయాపన చేస్తున్నారు. జీవో –3 విషయంలో అసలు వాస్తవాలు గిరిజన సోదరులకు తెలియాలి. 2002లో టీడీపీ హయాంలోనే సుప్రీంకోర్టులో కేసులు పడ్డాయి. 18 ఏళ్ల సుదీర్ఘ వాదనల అనంతరం 2020 ఏప్రిల్‌ 22న సుప్రీంకోర్టు జీవో–3ని రద్దు చేసింది. దీనిపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వెంటనే స్పందించి 2020 జూన్‌ 18న 111వ ఏపీ ట్రైబల్‌ అడ్వైజరీ కౌన్సిల్‌ సమావేశంలో తీర్మానం చేయించి.. జూలై 13న సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది.

2024 ఏప్రిల్‌లో ఏపీ ప్రభుత్వ రివ్యూ పిటిషన్‌తో పాటు మరో 15 రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మేం రివ్యూ పిటిషనే వేయలేదని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పదేపదే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. మీ సమీక్షా సమావేశాల్లో పాల్గొన్న ఐఏఎస్‌ అధికారులు, లా సెక్రటరీలతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ వేయలేదని చెప్పించే దమ్ము కూటమి ప్రభుత్వానికి ఉందా. స్వచ్ఛందంగా రోడ్డెక్కిన ఏజెన్సీ యువతకు జీవో–3పై నాలెడ్జ్‌ లేదనడం, వారిని వైఎస్సార్‌సీపీ ప్రలోభపెట్టిందనడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే. 

మా ప్రభుత్వంలోనే ఎస్టీ కమిషన్‌ను వేరు చేశాం, సచివాలయం, వలంటీర్‌ ఉద్యోగాలన్నీ స్థానిక గిరిజనులకే ఇచ్చాం.3.22 లక్షల ఎకరాల పోడు భూములను గిరిజనులకు కట్టబెట్టి పట్టాలిచ్చాం. 1.70 లక్షల మంది రైతులకు మేలు చేశాం. ఐదేళ్లలో రూ.20 వేల కోట్లను గిరిజన సంక్షేమానికి ఖర్చు చేశాం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి జీవో–3ని వెంటనే పునరుద్ధరించాలి. గిరిజనుల హక్కులను కాలరాస్తే ఏజెన్సీ తిరగబడుతుంది. 

గిరిజన ప్రాంతాల్లో మెడికల్‌ కాలేజీలకు భూములిచ్చింది ఆదివాసీలే. అందులో కల్పించే ఉద్యోగాల్లో 6శాతం మాత్రమే గిరిజనులకు ఇస్తూ 94 శాతం గిరిజనేతరులకు కట్టబెడితే గిరిజన యువత ఎలా బతకాలి. 1/70 యాక్ట్‌ను తుంగలో తొక్కి మైదాన ప్రాంత వాసులు ఏజెన్సీ భూములను కబ్జా చేస్తున్నారు. గిరిజన చట్టాలు, హక్కులపై సరైన రీతిలో స్పందించి న్యాయం చేయకపోతే భవిష్యత్‌లో ఉద్యమాలు మరింత తీవ్రరూపం దాలుస్తాయి’ అని వైఎస్సార్‌సీపీ నేతలు చంద్రబాబు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement