లొసుగులతో కూడిన జీవో 444తో 22ఏ భూముల రక్షణకు గండి
సంస్కరణ ముసుగులో అడ్డగోలు మార్గదర్శకాలు
విలువైన భూములపై అమరావతి పెద్దలకు నిర్ణయాధికారం
ఆర్డీఓల అధికారాలకు కత్తెర వేసిన వైనం
సీసీఎల్ఏలోని పెండింగ్ అప్పీళ్లు, రివిజన్లన్నీ ప్రభుత్వానికి బదిలీ
ఏపీఐఐసీ, మారిటైమ్ భూములకు కొత్త వర్గీకరణ
ఒక్క వినతితో ఆ భూములు పట్టాగా మారే అవకాశం
తద్వారా వేల ఎకరాలు ప్రైవేటు చేతుల్లోకి వెళ్లే ముప్పు
దేవదాయ, వక్ఫ్ భూములకూ ఎసరు
నిర్ణయాధికారాల కేంద్రీకరణపై రెవెన్యూ నిపుణుల ఆందోళన
ప్రజల భూములు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా ఉన్న 22ఏ వ్యవస్థను బలహీన పరిచి.. లక్షల ఎకరాల విలువైన భూములు ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదానికి చంద్రబాబు సర్కారు తలుపులు తెరిచింది. ఇది ప్రమాదం అని తెలిసినా ఎందుకిలా చేస్తోందంటే దండుకోవడమే లక్ష్యమని ఇట్టే తెలుస్తోంది. ఎన్నో లొసుగులతో కూడిన జీవో 444 ఇందుకు నిదర్శనం. ఇది సంస్కరణ పేరు చెప్పి విలువైన ప్రభుత్వ భూములు, దేవదాయ–వక్ఫ్ ఆస్తులు, తీర ప్రాంత భూములను నచ్చిన వారికి కట్టబెట్టే ఎత్తుగడ. భూ పరిపాలనలో రాజకీయ జోక్యాన్ని పెంచి అందినకాడికి వెనకేసుకోవడమే ఇందులో మర్మమని రెవెన్యూ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి, అమరావతి: నిషేధిత ఆస్తుల జాబితాపై చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన 444 నంబర్ జీవో లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతం అయ్యేందుకు దోహదం చేసేలా ఉందని రెవెన్యూ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైకి ఇది ఒక సంస్కరణలా కనిపిస్తున్నా, లోతుగా పరిశీలిస్తే ప్రజల భూములు, ప్రభుత్వ ఆస్తులకు ముప్పు తెచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. గతంలో తెచ్చిన 22ఏ రక్షణ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ఈ జీవోలో పకడ్బందీగా ఏర్పాట్లు జరిగినట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఏపీఐఐసీ), ఏపీ మారిటైమ్ బోర్డు భూములకు వెబ్ల్యాండ్లో కొత్త వర్గీకరణ చేస్తామనడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ఆ సంస్థలు ఆన్ౖలెన్లో అభ్యర్థన పెడితే చాలు సీసీఎల్ఏ ఆమోదంతో ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి వెబ్ల్యాండ్లో పట్టాగా మార్చే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో ఆ భూముల ఇష్టానుసారం అమ్మకాలు, బదిలీలు, రిజిస్ట్రేషన్లకు తలుపులు బార్లా తెరిచినట్లే. ఈ మార్పునకు గెజిట్ నోటిఫికేషన్, అసెంబ్లీ ఆమోదమే కాదు కనీసం కేబినెట్ సమ్మతం కూడా అవసరం లేదు. ఒక ఆన్లైన్ వినతితో కార్పొరేట్, ప్రైవేట్ కంపెనీలకు మేలు చేయడం కోసం ఇంత పెద్ద మార్పు వెంటనే జరిగిపోతుంది.
దీనివల్ల ఏపీఐఐసీ ఆధీనంలో ఉన్న లక్షలాది ఎకరాలు ఆ కంపెనీల పరమయ్యేందుకు ఆస్కారం కల్పించినట్లే. మరోవైపు రామాయపట్నం పోర్టు నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించే పీపీపీ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండగా అదే మారిటైమ్ బోర్డు భూములను నిషేధిత జాబితా నుంచి తప్పించి పట్టాలుగా మార్చే వెసులుబాటు కల్పించడం గమనార్హం. పోర్టుల చుట్టూ భవిష్యత్తులో బంగారం కానున్న ఈ తీర ప్రాంత భూముల్ని ప్రైవేటు వారి చేతుల్లో పెట్టడం చాలా సులువు అవుతుంది.
విలువైన భూములు అమరావతి పెద్దల చేతుల్లోకి..
ఇప్పటి వరకు 22ఏ జాబితాలో చేర్పులు, తొలగింపులు క్షేత్ర స్థాయి రికార్డుల ఆధారంగా ఆర్డీవో, సబ్ కలెక్టర్ స్థాయిలో జరిగేవి. ఇకపై వ్యవసాయ భూమి ఎకరం దాటినా, వ్యవసాయేతర స్థలం వెయ్యి చదరపు గజాలు దాటినా 22ఏ జాబితాలో చేర్చే తుది నిర్ణయం ప్రభుత్వానిదే. దీనర్థం చిన్న చిన్న భూములపై నిర్ణయం అధికారుల స్థాయిలో తేలిపోతుంది. అమరావతి, విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి నగర శివార్లలో రూ.కోట్ల విలువ చేసే ఎకరాలకు ఎకరాల భూముల ఫైళ్లు మాత్రం పెద్దల వద్దకు వెళ్లాల్సిందే.
అలాగే సీసీఎల్ఏ (భూ పరిపాలన ప్రధాన కమిషనర్) వద్ద పెండింగ్లో ఉన్న అప్పీళ్లు, రివిజన్లు, రివ్యూలు అన్నింటినీ ప్రభుత్వానికి బదిలీ చేసుకున్నారు. రివిజన్ అధికారం ప్రభుత్వానిదే.. స్టే ఇచ్చే అధికారం ప్రభుత్వానిదే.. ఏ అధికారి ఉత్తర్వునైనా సుమోటోగా తిరగదోడే అధికారం కూడా ప్రభుత్వానిదే. రికార్డుల ఆధారంగా నడవాల్సిన క్వాసీ జ్యుడీషియల్ వ్యవస్థను రాజకీయ నాయకుల చేతుల్లో పెట్టడంపై రెవెన్యూ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలపై సామాన్యులు తహశీల్దార్, కలెక్టరేట్ల చుట్టూ తిరగడమే భారమైతే ఇప్పుడు ఏకంగా అమరావతి పెద్దల చుట్టూ తిరగడం వారికి సాధ్యమవుతుందా.. అనే ప్రశ్నలకు సమాధానం లేదు. ఈ కొత్త ఏర్పాటు అధికార పార్టీ నేతల కోసమేనని స్పష్టమవుతోంది.
దేవుడి భూములకూ ఎసరు
వేలంలో అమ్మిన దేవదాయ, వక్ఫ్ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలనే నిర్ణయం వివాదాస్పదమే. గతంలో వివాదాస్పదంగా, నామమాత్రపు ధరలకు, బినామీల పట్టుతో జరిగిన వేలాలకూ రక్షణ కల్పించేందుకే ఈ లొసుగు పెట్టుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మరోవైపు కోర్టు కేసులు, ‘ఇతరాలు’ కేటగిరీల ఎంట్రీలపై ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మూడు నెలల్లో కోర్టు ఉత్తర్వు, గెజిట్ నోటిఫికేషన్ స్కాన్డ్ కాపీలు అప్లోడ్ చేయకపోతే ఆ ఎంట్రీలన్నీ మూకుమ్మడిగా తొలగిపోతాయి. దశాబ్దాల నాటి కేసుల రికార్డులను, తాలూకా ఆఫీసుల్లో మురిగిపోతున్న ఫైళ్లను మూడు నెలల్లో వెతకడం అసా«ద్యమని అధికారులే అంటున్నారు. వివాదాల్లో ఉన్న భూములు, కోర్టుల్లో నలుగుతున్న ఆస్తులను 22ఏ జాబితా నుంచి తప్పించి కమీషన్లు, వాటాలు దండుకునేందుకే ఈ ఏర్పాట్లు చేసినట్లు అర్థమవుతోంది.


