మానవుడి పరిస్థితి ఏంటి?

subramaniapuram first look release - Sakshi

‘మళ్ళీ రావా’ వంటి హిట్‌ చిత్రం తర్వాత సుమంత్‌ నటి స్తున్న తాజా చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’.  సుమంత్‌ కెరీర్‌లో ఇది 25వ సినిమా. ఈషా కథానాయిక. సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో బీరం సుధాకర్‌ రెడ్డి, ధీరజ్‌ బొగ్గరం నిర్మిస్తున్నారు. చిత్ర నిర్మాతల్లో ఒకరైన బీరం సుధాకర్‌ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ‘సుబ్రహ్మణ్యపురం’ చిత్రం ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సూపర్‌ నేచురల్‌ అంశాల మేళవింపుతో సాగే మిస్టరీ థ్రిల్లర్‌ మూవీ ఇది. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ ప్రేక్షకులకు కలుగుతుంది. దెయ్యానికి ఆగ్రహమొస్తే దేవుణ్ణి ఆశ్రయించవచ్చు.

మరి దేవుడికే ఆగ్రహమొస్తే మానవుడి పరిస్థితి ఏంటి? అనే చక్కని కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. సుమంత్‌ ఈ చిత్రంలో నాస్తికుడిగా నటిస్తున్నారు. దేవుడంటే నమ్మకం లేని హీరో ఇష్ట పడ్డ అమ్మాయి కోసం, ఓ గ్రామం కోసం దేవుడితో ఎలా పోరాడాడు? ఎందుకు పోరాడాడు? అనే ఆసక్తికరమైన కథతో, ఉత్కంఠ కలిగించే స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రం ఉంటుంది. ఈ నెల, ఆగస్టులో జరిగే షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది’’ అన్నారు. సురేశ్, తనికెళ్ల భరణి, జోష్‌ రవి, భద్రమ్, గిరి, మాధవి, హర్షిణి, అమిత్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఆర్కే ప్రతాప్, సంగీతం: శేఖర్‌ చంద్ర.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top