ఓ శుభవార్త!

ఓ శుభవార్త!


‘‘మీతో ఓ శుభవార్త పంచుకోవాలనుకుంటున్నా. కాకపోతే 24 గంటల తర్వాతే’’ అంటూ శ్రుతీహాసన్ ట్విట్టర్‌లో ఊరించారు. ఇది చదివినవాళ్లల్లో కొంతమంది శ్రుతి చెప్పనున్న ఆ శుభవార్త తన పెళ్లికి సంబంధించినది కావచ్చని కొందరు ఊహించేసుకున్నారు. కానీ, ఇటీవల ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను’ అన్నారు కాబట్టి, పెళ్లికి సంబంధించిన వార్త అయ్యుండక పోవచ్చని కూడా భావించారు. వాస్తవానికి శ్రుతి చెప్పాలనుకున్న వార్త ఓ చిత్రానికి సంబంధించింది.



నాగార్జున, కార్తీ కాంబినేషన్‌లో పీవీపీ సంస్థ ఓ చిత్రం నిర్మించడానికి సన్నాహాలు చేస్తోందని తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో శ్రుతీహాసన్‌ను కథానాయికగా తీసుకున్నారు. దీని గురించే శ్రుతి ప్రత్యేకంగా ప్రకటించాలనుకున్నారు. ఈ కథ విన్నాననీ, కొత్తగా ఉండటంతోపాటు హృదయానికి హత్తుకునే విధంగా ఉందని ఆమె తెలిపారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళాల్లో పొట్లూరి వి. ప్రసాద్ నిర్మించనున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top