అభిమానులకు డబుల్ ధమాకా!

అభిమానులకు డబుల్ ధమాకా! - Sakshi


ఇప్పటి వరకు దక్షిణ, ఉత్తరాది భాషల్లో శ్రుతీ హాసన్ దాదాపు ఇరవై చిత్రాలు చేస్తే, వాటిలో ఆమె తన మాతృభాష తమిళంలో చేసినవి మాత్రం రెండే రెండు. ఎప్పటికప్పుడు తమిళంలో ఎక్కువ సినిమాలు అంగీకరించాలని శ్రుతికి ఉన్నప్పటికీ డేట్స్ ఖాళీ లేక చేయలేకపోతున్నారట. కానీ, ఈ ఏడాది తన తమిళ అభిమానులను ఆనందపరిచేలా ఏకంగా రెండు సినిమాలు అంగీకరించారు. ఒకటి విశాల్ సరసన చేస్తున్న ‘పూజై’. గత కొన్నాళ్లుగా ఈ  చిత్రం షూటింగ్ జరుగుతోంది. తాజాగా, తమిళంలో ఓ భారీ చిత్రానికి పచ్చజెండా ఊపారు శ్రుతి. ‘తమిళంలో నేను చేయనున్న భారీ సినిమా గురించి త్వరలో ప్రకటిస్తా’ అంటూ రెండు రోజుల క్రితం ఆమె తన అభిమానులను ఊరించారు.



‘అది ఏ సినిమా అయ్యుంటుంది? ఏ హీరో సరసన శ్రుతి నటించనుంది?’ అని పలువురు చర్చించుకున్నారు. ఇప్పుడా సీక్రెట్‌ను బయటపెట్టేశారు శ్రుతి. విజయ్ హీరోగా శింబుదేవన్ దర్శకత్వం వహించనున్న ఓ చారిత్రక చిత్రంలో కథానాయికగా నటించనున్నట్లు ఆమె ప్రకటించారు. విజయ్ లాంటి పెద్ద హీరో సరసన సినిమా చేయనుండటం ఆనందంగా ఉందని అన్నారు.



అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో రూపొందనున్న ఈ చిత్రంలో జగదేక సుందరి శ్రీదేవి, సుదీప్ కీలక పాత్రలు చేయనున్నారు. విజయ్‌కి ఇది 58వ చిత్రం కావడంతో ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్‌గా ‘విజయ్ 58’ అని నిర్ణయించారు. ఏది ఏమైనా శ్రుతి ఇలా తమిళంలో ఒకేసారి రెండు సినిమాలు అంగీకరించడం, అందులోనూ ఒకటి పెద్ద హీరో సరసన భారీ చిత్రం కావడం అక్కడి అభిమానులకు డబుల్ ధమాకా అనే చెప్పాలి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top