సమస్యలను పరిష్కరించడమే గిల్డ్‌ టార్గెట్‌

Sarileru Neekevvaru and Ala Vaikunta Puram Lo movie producers press meet - Sakshi

– ‘దిల్‌’ రాజు  

మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్‌ ‘అల వైకుంఠపురములో చిత్రాలు ఈ నెల 11, 12 తేదీల్లో విడుదల కానున్నాయి. అయితే ఈ చిత్రాల విడుదల తేదీలపై రెండు మూడురోజులుగా  చిన్న అస్పష్టత ఏర్పడింది. విడుదల తేదీలు మారే అవకాశం ఉందనే వార్తలు వినిపించాయి. కానీ ‘ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌’ చొరవతో ఈ సినిమాలు ముందు ప్రకటించిన తేదీల్లోనే రిలీజ్‌ కానున్నాయి. ఈ విషయాన్ని తెలియజేయడానికి ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత కె.ఎల్‌. దామోదర ప్రసాద్‌ మాట్లాడుతూ – ‘‘చర్చల అనంతరం సినిమా విడుదల తేదీలపై క్లారిటీ వచ్చింది. కారణాలు ఏమైనా కావచ్చు. సమస్యలకు పరిష్కారం దొరకడమే ముఖ్యం. ఈ రోజు జరిగిన మీటింగ్‌లో అందరూ పాజిటివ్‌గానే స్పందించారు’’ అన్నారు.

‘దిల్‌’ రాజు మాట్లాడుతూ – ‘‘గతంలో జరిగిన ‘ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌’ మీటింగ్‌లో నిర్మాతలతో మాట్లాడి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని 11వ తేదీన, అల వైకుంఠపురములో చిత్రాన్ని 12న విడుదల చేయాలనుకున్నాం. అయితే కొన్ని పరిణామాల మధ్య ‘అల వైకుంఠపురములో’ జనవరి 10 లేదా 11న విడుదల అవుతుందని వార్తలు వచ్చాయి. దాంతో మరోసారి గిల్డ్‌లో చర్చలు జరిగాయి. పెద్ద సినిమాలు విడుదలవుతున్నప్పుడు అందరూ బావుండాలనే ఉద్దేశంతో ముందు అనుకున్న తేదీలకే సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలను ఒప్పించాం. ఇండస్ట్రీలో ఇలాంటి సమస్యలు వస్తే పరిష్కరించడానికి గిల్డ్‌ ముందుంటుంది. ఎందుకు కన్‌ఫ్యూజన్‌ వచ్చింది అనేది పక్కన పెడితే సమస్యను పరిష్కరించడమే గిల్డ్‌ టార్గెట్‌’’ అన్నారు. నిర్మాత రాజీవ్‌ రెడ్డి కూడా పాల్గొన్నారు.     
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top