నటులు కూడా బిచ్చగాళ్లలాంటి వాళ్లు..!
కోల్కతా: సినీ నటులు కూడా బిచ్చగాళ్లలాంటివాళ్లేనని అంటోంది ప్రముఖ బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ. ప్రస్తుతం ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రాను పెళ్లి చేసుకొని వైవాహిక జీవితాన్ని గడుపుతున్న ఈ అమ్మడు తాజాగా ఇండియా టుడే ఈస్ట్ సదస్సులో ముచ్చటించింది. నటులు బిచ్చాగాళ్లలాంటి వాళ్లేనని, వాళ్లకొచ్చే ఆఫర్స్లోనే ఎంచుకొని నటించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చింది.
తనకు ఏదైనా పాత్ర వస్తే.. అది ప్రజలు నమ్మేలా తెరపై నటించేందుకు ప్రయత్నిస్తానని రాణి తెలిపింది. బంటీ ఔర్ బబ్లీ సినిమాలో అమితాబ్ బచ్చన్తో కలిసి నటించడం ఆస్వాదించానని పేర్కొంది. బ్లాక్ సినిమా సెట్స్లో అంధ, చెవిటి వారి నుంచి ఎంతో నేర్చుకున్నానని తెలిపింది. పద్మావతి సినిమా వివాదంపై స్పందిస్తూ ఒక సమాజంగా మనం ప్రేమను పెంపొందించుకోవాలిగానీ, ద్వేషాన్ని కాదని ఆమె సూచించింది. తమ ఇంట్లో సినిమాల గురించి అస్సలు చర్చించమని, తమ మధ్య ఉన్న అన్యోన్యమైన బంధం, కూతురి గురించే చర్చించుకుంటామని తెలిపింది.