వాటిని వేస్ట్ చేస్తే నాకు నచ్చదు! | Sakshi
Sakshi News home page

వాటిని వేస్ట్ చేస్తే నాకు నచ్చదు!

Published Sun, Mar 6 2016 10:31 PM

వాటిని వేస్ట్ చేస్తే నాకు నచ్చదు!

తెలుగు పరిశ్రమలో ‘మోస్ట్ వాంటెడ్’ హీరోయిన్‌గా దూసుకెళుతున్నారు రకుల్ ప్రీత్‌సింగ్. ఇటీవల ఓ సందర్భంలో ఈ బ్యూటీ పొదుపు గురించి మాట్లాడారు. ముఖ్యంగా తన కళ్లెదుట ఆహారాన్నీ, నీటినీ  వృథా చేసేవాళ్లను చూసినప్పుడు చాలా కోపం వస్తుందట. ఆ విషయం గురించి రకుల్ మాట్లాడుతూ - ‘‘ఆహారం, నీరు లేనిదే మనిషి మనుగడ కష్టమవుతుంది. అందుకే, ఈ రెండింటినీ అస్సలు వృథా చేయకూడదు. కొంతమంది ట్యాప్ ఫుల్‌గా తిప్పేసి, చేతులు కడుక్కుంటారు. పనైన తర్వాత వెంటనే కట్టేయరు. అలాంటి సంఘటనలను చూసినప్పుడు, ఇవన్నీ ఒకరు నేర్పించేవి కావు.

ఎవరి విజ్ఞత వాళ్లకుండాలనిపిస్తుంది. అవసరం లేనప్పుడు నీటిని ఉపయోగించడం, ఆహారాన్ని నేలపాలు చేయడంలాంటివి చూస్తే ఒళ్లు మండిపోతుంది. విద్యుత్తుని కూడా ఆదా చేయాలి. కొంతమంది టీవీ ఆన్ చేసి ఉంచి, మొహానికి పేపర్ అడ్డం పెట్టుకుని చదువుతుంటారు. ఫ్యాన్, ఏసీ ఒకేసారి వేసుకునే ప్రబుద్ధులను కూడా చూశాను. మనకేంటిలే ఎంత బిల్లు వచ్చినా కట్టేస్తాం అనే ధీమాతోనే వాళ్లలా చేస్తారనుకుంటా. కానీ, విద్యుత్తు తయారీకి ఎంత కష్టపడాల్సి వస్తుందో తెలుసుకోవాలి. అలాగే, నీళ్లు కూడా. అందుకే ప్రతి ఒక్కరూ వీటిని పొదుపు చేసే విషయంలో బాధ్యతగా వ్యవహరించాలి’’ అని చెప్పారు. మంచి మాటలు ఎవరు చెప్పినా వినాలి. పైగా.. అందగత్తెలు చెబితే ఆచరణలో పెట్టాలనిపిస్తుంది కదూ!

Advertisement
Advertisement