యమధీర : చరణ్ Vs తారక్
బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకధీరుడు రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని ఇంతవరకు ప్రకటించలేదు. అయితే ఇటీవల తన సోషల్ మీడియా పేజ్ లో ఓ ఆసక్తికరమైన ఫొటోను ఫోస్ట్ చేసిన జక్కన్న నెక్ట్స్ ప్రాజెక్ట్ పై హింట్ ఇచ్చాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో రాజమౌళి దిగిన ఫొటో త్వరలో ఈ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కబోతోందన్న వార్తలను తెర మీదకు తీసుకువచ్చింది.
ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేకపోయినా ఈ ప్రాజెక్ట్ పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. డీవివి దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు ఈ సినిమాకు యమధీర అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. ఇద్దరు బాక్సర్ల కథతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాను 2018 ఫిబ్రవరిలో సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్లాన్ లో ఉన్నారట.
బాక్సర్లు గా కనిపించేందుకు చరణ్, ఎన్టీఆర్ లు ఇప్పటికే ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నారట. రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 సినిమాలో నటిస్తుండగా జై లవ కుశ సినిమా తరువాత త్రివిక్రమ్ తో సినిమాను ప్రారంభించిన ఎన్టీఆర్ ప్రస్తుతం ఆ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. గతంలో క్రీడా నేపథ్యంలో సై సినిమాతో మంచి విజయాన్ని సాధించిన రాజమౌళి ఈ సారి మల్టీ స్టారర్ సినిమతో ఎలాంటి చరిత్ర సృష్టిస్తాడో అని అభిమానులు ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నారు.
సంబంధిత వార్తలు