అకృత్యాల నిర్మూలనకు చట్టాలు తేవాలి

Professor Kodandaram Talk About Telugu Film Industry - Sakshi

క్యారెక్టర్‌ ఆర్టిస్టుల సమావేశంలో కోదండరాం డిమాండ్‌

సినీరంగ దోపిడీపై అసెంబ్లీలో నిలదీస్తా: ఆర్‌.కృష్ణయ్య

రెండు రోజుల్లో సినీ పెద్దలు చర్చలకు రాకుంటే ఆందోళన: శ్రీరెడ్డి

హైదరాబాద్‌: చిత్ర పరిశ్రమలో జరుగుతున్న అకృత్యాల నిర్మూలనకు చట్టాలు తేవాలని తెలంగాణ జనసమితి పార్టీ (టీజేఎస్‌) వ్యవస్థాపక అధ్యక్షుడు, టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. చిత్ర పరిశ్రమలోని విచ్చలవిడితనం చూస్తుంటే ఫ్యూడల్‌ వ్యవస్థ గుర్తుకొస్తోందని అన్నారు. పరిశ్రమలో కిందిస్థాయి క్యారెక్టర్‌ ఆర్టిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై శ్రీరెడ్డి అనే యువతి చేస్తున్న పోరాటం ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సోమ వారం హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుల సదస్సు జరిగింది.

దీనికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. చిత్ర రంగంలో తెలుగు వారికి అన్యాయం జరుగుతోందన్నారు. వారికి ఎక్కు వ అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత ఇండస్ట్రీకి ఉం దన్నారు. అవసరమైతే దీనికి చట్టం తేవాలని డిమాండ్‌ చేశారు. సినీరంగంలో మధ్యవర్తిత్వ వ్యవస్థ ఉండటం వల్ల క్యారెక్టర్‌ ఆర్టిస్టులకు సరైన న్యాయం జరగట్లేదన్నారు. నైపుణ్యాన్ని బట్టి అవకాశం ఇవ్వాలే కానీ.. అవకాశం ఇచ్చి లైంగికంగా అమ్మాయిలను వాడుకోవడం అనే ది సిగ్గుచేటన్నారు. కొన్ని రోజులుగా ఇంత ఉద్యమం జరుగుతున్నా పోలీసులు కేసులు నమోదు చేయకపోవడం చూస్తుంటే సిగ్గుచేటుగా ఉందన్నారు. శ్రీరెడ్డి, ఇతర ఆర్టిస్టులు చేసిన ఆరోపణల్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయో.. వారందరిపై కేసులు పెట్టాలన్నారు.  

మంత్రి తలసానితో చర్చిస్తా: ఆర్‌.కృష్ణయ్య 
చిత్ర పరిశ్రమను ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య అన్నారు. కొద్దిరోజులుగా శ్రీరెడ్డి అనే అమ్మాయి రోడ్డెక్కి ఉద్యమం చేస్తుంటే ప్రభుత్వం కళ్లకు కనిపిం చడం లేదా అని ప్రశ్నించారు. పరిశ్రమలలో జరుగుతున్న అకృత్యాలపై అసెంబ్లీలో చర్చించి, ప్రభుత్వాన్ని నిలదీస్తానని హెచ్చరించారు. హీరోలేమో కోట్లాది రూపాయిలు సంపాదించుకుంటారు.. వాళ్ల సినిమాలో నటించిన క్యారెక్టర్‌ ఆర్టిస్టులు మాత్రం తినేందుకు తిండి, కట్టుకునేందుకు బట్ట, ఉండేందుకు నీడ లేకుండా ఉండాలా అని ప్రశ్నించారు. పరిశ్రమలో తెరవెనుక జరిగే అకృత్యాలను సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ దృష్టికి తీసికెళ్తానన్నారు. దీని పరిష్కారం కోసం సినీ దిగ్గజాలతో ఓ చర్చ ను ఏర్పాటు చేస్తానన్నారు. జయభేరి సంస్థకు చెందిన వేలాది ఎకరాల ను క్యారెక్టర్‌ ఆర్టిస్టులకు కేటాయించాలన్నారు. లేనిపక్షంలో అందరితో అక్కడ గుడిసెలు వేయిస్తానని హెచ్చరించారు. 

ఫ్యాన్స్‌ మాటలకు పవన్‌ చెక్‌ పెట్టాలి  
సినీ ఇండస్ట్రీ గురించి తాము చేస్తున్న వ్యాఖ్యలపై హీరో పవన్‌కల్యాణ్‌ ఫ్యాన్స్‌ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని శ్రీరెడ్డి అన్నారు. వారు మాట్లాడుతున్న మాటలకు పవన్‌ చెక్‌ పెట్టాలన్నారు. ‘నీ ఫ్యాన్స్‌ను అడ్డం పెట్టుకుని అనవసరంగా మాపై దాడి చేయిస్తే రానున్న ఎన్నికల్లో నీ ఓట్లన్నీ గల్లంతవుతాయి’అని ఆమె పవన్‌ను హెచ్చరించారు. పరిశ్రమకు చెందిన స్టూడియోలు బ్రోతల్‌ హౌస్‌లుగా మారాయన్నారు. కనీసం మోడలింగ్‌ చేసుకుందామంటే అక్కడ కూడా మంచు లక్ష్మీప్రసన్న లాంటి వాళ్లు వచ్చి తొక్కేస్తున్నారన్నారు.

సినీ పరిశ్రమకు 2 రోజులు గడువిస్తున్నామని, స్పందించి చర్చలకు రాకపోతే ‘మా’కార్యాలయం, స్టూడియోల ఎదుట ధర్నాలు, ఆందోళనలు చేస్తామన్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే రానున్న ఎన్నికల్లో ఓట్లు వేయమని హెచ్చరించారు. కార్యక్రమంలో పీవోడబ్ల్యూ సంధ్య, ఓయూ జేఏసీ అధ్యక్షుడు సంపత్, పలువురు ఆర్టిస్టులు ప్రసంగించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top