తప్పుగా అర్థం చేసుకుంటారేమో..!

Nivetha Pethuraj About Her Social Media Posts - Sakshi

సినిమా: తనను ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటారేమో నటి నివేదా పేతురాజ్‌ వాపోతోంది. దుబాయ్‌లో పెరిగిన ఈ తమిళ అమ్మాయి నటిగా కోలీవుడ్‌లో రాణిస్తోంది. తాజాగా టాలీవుడ్‌లోకీ ఎంట్రీ ఇచ్చిన నివేదా తమిళంలో ఒరునాళ్‌ కూత్తు చిత్రంతో పరిచయం అయ్యింది. ఆ తరువాత  జయంరవితో టిక్‌ టిక్‌ టిక్, విజయ్‌ ఆంటోనికి జంటగా తిమిరుపుడిచ్చవన్‌ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం నాలుగైదు చిత్రాలతో బిజీగా ఉంది. అందులో ప్రభుదేవాకు జంటగా పొన్‌ మాణిక్యవేల్, వెంకట్‌ప్రభు దర్శకత్వంలో పార్టీ చిత్రాలతో పాటు జగజాల్‌ కిల్లాడి, విజయ్‌సేతుపతితో ఒక చిత్రం, దుల్కర్‌ సల్మాన్‌ సరసన మరో చిత్రం చేస్తోంది. అయితే గ్లామర్‌ విషయంలో తనకంటూ హద్దులు విధించుకున్న ఈ బ్యూటీ పక్కింటి అమ్మాయి ఇమేజ్‌నే సొంతం చేసుకుంది.

అలాంటిది ఇటీవల కాస్త గ్లామర్‌తో కూడిన ఫోటోలను సామాజిక మాద్యమాలకు విడుదల చేసి చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఒక భేటీలో నివేదా మాట్లాడుతూ.. తాను చెప్పేది తప్పుగా అర్థం చేసుకుంటారని మౌనంగా ఉంటున్నాననీ, తాను సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన నటినని పేర్కొంది. అందుకే తనకు దైవభక్తి కాస్త ఎక్కువేనని చెప్పింది. తాను కళాశాలలో చదువుతున్నప్పుడు తన తల్లిదండ్రులు మధురై సమీపంలోని మడప్పురం కాళీ దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాలకు తీసుకెళ్లారని చెప్పింది. అప్పుడు తనకు పూనకం వచ్చిందని తెలిపింది. అప్పటి నుంచే తనలో భక్తి భావం మరింత పెరిగిందనీ, ఇప్పటికి అప్పుడప్పుడూ తనకు పూనకం వస్తుందని చెప్పింది. ఇకపోతే తనను చిత్ర పరిశ్రమలో తదుపరి నయనతారతో పోల్చడం సరి కాదని పేర్కొంది. సామాజిక మాధ్యమాల్లో జరుగున్న చర్చలపై నివేదా పేతురాజ్‌ వివరణ ఇచ్చుకున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top