నేను చెప్పిందే నిజమైంది: హీరోయిన్‌

Niti Taylor Comments About Her Love Story - Sakshi

ముందు నుంచీ చెప్పినట్లుగానే తాను ఇండస్ట్రీయేతర వ్యక్తినే పెళ్లి చేసుకోబోతున్నానని బాలీవుడ్‌ నటి నీతి టేలర్‌ అన్నారు. హిందీ సీరియళ్లతో పాటు తెలుగు తెరపై తళుక్కుమన్న నీతి ఎంగేజ్‌మెంట్‌ మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. భారత ఆర్మీ కెప్టెన్‌ పరీక్షిత్‌ బవాను ఆమె వివాహమాడనున్నారు. ఈ క్రమంలో తన నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను నీతి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. దీంతో ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడిన నీతి ప్రేమకథ గురించి చెప్పుకొచ్చారు.

‘స్కూలు రోజుల నుంచే పరీక్షిత్‌ పరిచయం. అప్పుడు మేమిద్దరం మంచి స్నేహితులం. చాలా కాలం దూరంగా ఉన్న మేము కొన్ని నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా మళ్లీ కలుసుకున్నాం. అప్పటి నుంచి మా మధ్య సంభాషణ పెరిగింది. ఆ క్రమంలో తను రత్నంలాంటి వాడని తెలుసుకున్నాను. ఢిల్లీకి వెళ్లి తనను కలిశాను. మా అమ్మానాన్న కూడా తనను కలిసి మాట్లాడారు. ఇరు కుటుంబాలు మా బంధానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాయి. ప్రతీ విషయంలో మా ఇద్దరి అభిరుచులు, అభిప్రాయాలు ఒక్కటే. ఇండస్ట్రీ వ్యక్తిని కాకుండా బయటి వ్యక్తిని చేసుకుంటానని గతంలో చెప్పాను. ఇప్పుడదే నిజమైంది. తను ఆర్మీ కెప్టెన్‌. అయితే మా పెళ్లి ఇప్పుడే జరగబోవడం లేదు. పరీక్షిత్‌ తన ఉద్యోగం రీత్యా వివిధ ప్రదేశాలకు వెళ్తుంటాడు. నేనేమో ముంబైలో ఉన్నాను. బహుశా వచ్చే ఏడాది మా వివాహం జరుగుతుంది’ అని నీతి తనకు కాబోయే భర్త వివరాలు తెలిపారు.

కాగా ఇష్క్‌బాజ్‌, గులాల్‌ వంటి హిట్‌ హిందీ సీరియళ్లలో నటిస్తున్న నీతి... టాలీవుడ్‌ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. తనీశ్‌ హీరోగా నటించిన ‘మేం వయసుకు వచ్చాం’, రాహుల్‌ రవీంద్రన్‌ ప్రధాన పాత్రలో నటించిన పెళ్లి పుస్తకం సినిమాలోనూ ఆమె హీరోయిన్‌గా నటించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top