రాజా వస్తున్నాడు

madhura raja movie updates - Sakshi

మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి లీడ్‌ రోల్‌లో ‘మన్యం పులి’ ఫేమ్‌ వైశాఖ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మధుర రాజా’. జై, మహిమా నంబియార్‌ కీలక పాత్రల్లో, జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో మలయాళంలో విడుదలై ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో ‘రాజా నరసింహ’గా జనవరి 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది. జై చెన్నకేశవ పిక్చర్స్‌ పతాకంపై సాధు శేఖర్‌ ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సాధు శేఖర్‌ మాట్లాడుతూ– ‘‘అదొక మారుమూల అటవీ ప్రాంతం.

ఓ వ్యక్తి తయారు చేసే కల్తీ మందు తాగి 75 మంది చనిపోతారు. ఆ సమస్యను నవ్యాంధ్ర ప్రజాసేన అధ్యక్షుడు రాజా ఎలా తీర్చాడు? అన్నదే ఈ చిత్రకథాంశం. చక్కని సందేశంతో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. మమ్ముట్టి మాస్‌ యాక్షన్‌ , జగపతిబాబు క్యారెక్టర్, గోపీ సుందర్‌ సంగీతం, సన్నీ లియోన్‌ ప్రత్యేక గీతం, పీటర్‌ హెయిన్‌  పోరాటాలు ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. మలయాళంలో వంద కోట్లు వసూలు చేసిన ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: నూల అశోక్, నిర్మాణ సారధ్యం: వడ్డీ రామానుజం, పురం రాధాకృష్ణ. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top