ఎంతవారికైనా శిక్ష తప్పదు
‘‘తప్పు చేస్తే ఎంతవారలైనా శిక్షార్హులే అనే కాన్సెప్ట్తో రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రం ‘ఎంతవారలైనా’. అద్వైత్, జహీదా శ్యామ్, అలోక్ జైన్, జి.సీతారెడ్డి ముఖ్య తారలుగా గురు చిందేపల్లి దర్శకత్వంలో తెరకెక్కింది. సంహిత, చిన్ని–చింటు సమర్పణలో రామదూత ఆర్ట్స్ పతాకంపై జి.సీతారెడ్డి తెలుగు, కన్నడ భాషల్లో నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురు చిందేపల్లి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కథ సీతారెడ్డిగారికి చెప్పినప్పుడే అన్ని లొకేషన్లు ముందుగానే ప్లాన్ చేసుకున్నాను.
ముఖ్యంగా మైసూర్, చిక్మంగుళూరు వంటి అందమైన ప్రదేశాల్లో పాటలు చిత్రీకరించాం. ఇటీవల విడుదలైన మా చిత్రం ఆడియోకి మంచి స్పందన వస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ సుక్కు, సినిమాటోగ్రాఫర్ మురళీమోహన్ రెడ్డి ఎంతో సహకరించారు. నా మిత్రుడు సీతారెడ్డికి నటన మీద ఆసక్తి ఉండటంతో ఈ సినిమాలో ఎస్పీ పాత్ర చేశారు’’ అన్నారు. నిర్మాత, నటుడు జి.సీతారెడ్డి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాకు కథే హీరో. దానికి తగ్గట్టు మంచి పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చిన సుక్కు మరో హీరోగా నిలిచారు.
రాఘవేంద్రరావుగారి సినిమాల్లో మ్యూజికల్ హిట్స్ చాలా ఉన్నాయి. అలా మా సినిమా పాటలు కూడా బాగుంటాయి. ఈ సినిమాకి అన్నీ బాగా కుదిరాయి కాబట్టే ఈ రోజు ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. గురు చిందేపల్లి సినిమా అంటే ఏమిటో చూపించారు. కచ్చితంగా మా ‘ఎంతవారలైనా’ పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను. సక్సెస్ మీట్లో మళ్లీ కలుద్దాం’’ అన్నారు. ‘‘ఎంతవారలైనా’లోని ‘ఏహే మురారి...’ పాట పది లక్షల వ్యూస్కి రీచ్ అయ్యింది. ఈ సినిమా కోసం సీతారెడ్డి చాలా కష్టపడ్డారు. ఆయనకి సినిమాలపై ఉన్న ప్యాషనే నిర్మాతను చేసింది’’ అని మ్యూజిక్ డైరెక్టర్ సుక్కు అన్నారు.