
సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యకు కారణమయ్యానంటూ తనపై కేసు పెట్టిన నేపథ్యంలో నిర్మాత ఏక్తాకపూర్ స్పందించారు. సుశాంత్కు నటుడిగా తొలి అవకాశమిచ్చింది తానేనని, అలాంటిది తనపైనే కేసు నమోదు కావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. సుశాంత్ ఆత్మహత్యకు చిత్రపరిశ్రమలో పాతుకుపోయిన బంధుప్రీతే కారణమంటూ వెల్లువెత్తున్న విమర్శలపై ఏక్తా ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్ర రిస్తా టీవీ సీరియల్లో సుశాంత్కు ఏక్తా కపూర్ తొలి అవకాశమిచ్చారు. అయితే, సుశాంత్కు లీడ్ రోల్ ఇవ్వడానికి చానెల్ తొలుత ఒప్పుకోలేదని, చివరికి సదరు చానెల్ను కన్విన్స్ చేసి ఒప్పించానని ఏక్తా కొన్ని వారాల క్రితమే తెలిపిన సంగతి తెలిసిందే.
సుశాంత్ ఆత్మహత్యపై బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్, ఏక్తాకపూర్, సంజయ్ లీలా భన్సాలీ సహా 8 మందిపై బిహార్ ముజఫర్ కోర్టులో బుధవారం కేసు నమోదైన సంగతి తెలిసిందే. సుశాంత్ ఆకస్మి మరణం సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు పలువురిని దిగ్ర్భాంతికి గురిచేసింది. దీంతో అతడి ఆత్మహత్యకు బాలీవుడ్లోని కొంతమంది ప్రముఖులే కారణమంటూ న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా ముజఫర్పూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 14న సుశాంత్ సింగ్ తన ఇంట్లో బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. యువ నటుడి ఆకస్మిక మరణంపై పలువురు దిగ్ర్భాంతికి గురయ్యారు. అంతేకాకుండా బాలీవుడ్లో పేరుకుపోయిన నెపోటిజమ్ వల్లనే సుశాంత్ బలయ్యాడంటూ సామాన్యులు సహా కంగనా రనౌత్, ప్రకాశ్రాజ్, అభినవ్ కశ్యప్ లాంటి పలువురు ప్రముఖులు బాహాటంగానే ఆరోపణలు చేశారు.