ఆయనతో చేయడానికి నో చెప్పిన సాయిపల్లవి.!

Director Vijay says about sai pallavi in karu movie audio function - Sakshi

తమిళసినిమా: కరు చిత్రంలో నటించడానికి నటి సాయిపల్లవి మొదట నిరాకరించిందని ఆ చిత్ర దర్శకుడు విజయ్‌ చెప్పారు. ఆయన దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన చిత్రం కరు. ఇందులో టాలీవుడ్‌ యువ నటుడు నాగశౌర్య హీరోగానూ, నటి సాయిపల్లవి హీరోయిన్‌గా నటించారు. సాయిపల్లవికి తమిళంలో ఇదే తొలి చిత్రం. వెరేకా అనే బాల నటి ప్రధాన పాత్రను పోషించిన ఇందులో నిగల్‌గళ్‌ రవి, రేఖ, సంతాన భారతి, ఎడిటర్‌ ఆంటోని ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శ్యామ్‌. సీఎస్‌ సంగీతం అందించారు. ఈ చిత్ర ఆడియా ఆవిష్కరణ కార్యక్రమం శనివారం స్థానిక టీ.నగర్‌లోని ఓ నక్షత్ర హోటల్‌లో నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో సాయిపల్లవి మాట్లాడుతూ.. తాను అనూహ్యంగా నటిగా రంగప్రవేశం చేశానని చెప్పారు. తమిళ సినీ అభిమానులే తనని ఈ స్థాయికి తీసుకొచ్చారన్నారు. తన తొలి చిత్రాన్ని (ప్రేమమ్‌ మలయాళ చిత్రం) తమిళ ప్రేక్షకులు విజయవంతం చేశారని, దీంతో తన బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. అందుకే తమిళంలో మంచి చిత్రం ద్వారా పరిచయం అవ్వాలని భావించానన్నారు. అందువల్ల ఇంత ఆలస్యమైందని చెప్పారు. దర్శకుడు విజయ్‌ కురు చిత్ర కథ చెప్పగానే ఇదే తన ఎంట్రీకి సరైన కథ అని భావించానన్నారు. కురు చిత్రంలో భావోద్రేకాలతో కూడిన పాత్రలో జీవించే ప్రయత్నం చేశానని అన్నారు. 

దర్శకుడు విజయ్‌ మాట్లాడుతూ తన కెరీర్‌లోనే చాలా ముఖ్యమైన చిత్రంగా కరు నిలిచిపోతుందన్నారు. రెండేళ్ల క్రితం ఈ చిత్ర కథను లైకా సంస్థకు చెప్పానని గుర్తుచేసుకున్నారు. ఈ కథను అనుకున్నప్పుడే ఇందులో హీరోయిన్‌గా సాయిపల్లవి అయితే  బాగుంటుందని భావించామన్నారు. ఆమెను కలిసినప్పుడు కరు చిత్రంలో నటించలేనని ఖరాఖండిగా చెప్పారని అన్నారు. అయితే ఒకసారి కథ వినండి ఆ తరువాత చెప్పండి అని అడగడంతో కథ విన్న సాయిపల్లవి ఈ చిత్రంలో తాను నటించడానికి ఒప్పుకున్నారని చెప్పారు. ఈ చిత్రానికి పక్కా బలం సాయిపల్లవే అని పేర్కొన్నారు. అదే విధంగా నాగశౌర్య చాలా బాగా నటించారని, ఆయనకు తమిళంలో మరిన్ని అవకాశాలు వస్తాయని దర్శకుడు విజయ్‌ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top