వారధిపై వీరబాదుడు

Bandra-Worli sea link recreated in Ramoji Film City for Prabhas' Saaho - Sakshi

బాంద్రా–వర్లీ వారధి ఎక్కడ ఉంది? అంటే ముంబైలో అని చెబుతారు. కానీ ఇప్పుడీ వారధి హైదరాబాద్‌లో ఉందంటే ఆశ్చర్యపోవడం ఖాయం. అవును.. బాంద్రా–వర్లీ పీ లింక్‌ బ్రిడ్జ్‌ని ‘సాహో’ టీమ్‌ హైదరాబాద్‌లో రీ–క్రియేట్‌ చేశారని సమాచారం. ప్రభాస్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్న సినిమా ‘సాహో’. ఇందులో శ్రద్ధాకపూర్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ముంబైలోని బాంద్రా–వర్లీ సీ లింక్‌ బ్రిడ్జ్‌ దగ్గర కీలక సన్నివేశాలను చిత్రీకరించాలట.

రద్దీగా ఉండే ఆ ఏరియాలో షూటింగ్‌ అంటే కష్టమే. అందుకే హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో సెట్‌ వేయిస్తున్నారని తెలిసింది. ఈ సెట్‌ కోసం దాదాపు 20 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నారట. ఈ సినిమా మొత్తం బడ్జెట్‌ 300 కోట్లు అయితే.. అందులో దాదాపు 120 కోట్ల రూపాయలను యాక్షన్‌ సీక్వెన్స్, గ్రాఫిక్స్‌ వర్క్‌ కోసమే ఖర్చు చేస్తున్నారని టాక్‌. ఇప్పుడు బాంద్రా–వర్లీ సీ లింక్‌ వారధిపై ఓ భారీ చేజింగ్‌ సీన్‌ను ప్లాన్‌ చేశారట.

ఈ చేజ్‌లో హీరో ప్రభాస్‌తో పాటు విలన్‌ నీల్‌ నితిన్‌ ముఖేష్‌ కీలకంగా ఉంటారని తెలిసింది. ‘ట్రాన్స్‌ఫార్మర్స్‌’ సిరీస్, ‘పెరల్‌ హార్బర్‌’ వంటి హాలీవుడ్‌ సినిమాలకు యాక్షన్‌ కొరియోగ్రఫీ చేసిన కెన్నీ బేట్‌ ఈ సినిమాకు వర్క్‌ చేస్తున్నారు. యాక్షన్‌ సీక్వెన్స్‌ అబ్బురపరిచేలా ఉంటాయట. మార్చి నెలాఖరుకల్లా మొత్తం షూటింగ్‌ను కంప్లీట్‌ చేయాలనే ఆలోచనలో ‘సాహో’ టీమ్‌ ఉన్నట్లు తెలిసింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top