‘అక్షయ్‌ని కాదని సుశాంత్‌ను తీసుకున్నాను‌’ | Akshay Kumar Wanted To Do Sushant Singh Rajput Character In MS Dhoni Biopic | Sakshi
Sakshi News home page

ఆసక్తికర విషయాలు వెల్లడించిన నీరజ్‌ పాండే

Jun 20 2020 9:10 PM | Updated on Jun 20 2020 9:15 PM

Akshay Kumar Wanted To Do Sushant Singh Rajput Character In MS Dhoni Biopic - Sakshi

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ జూన్ 14న ముంబైలో  కన్ను మూసిన సంగతి తెలిసిందే. డిప్రెషన్‌తో బాధపడుతున్న సుశాంత్‌ ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఈ క్రమంలో ధోని బయోపిక్‌కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. మాజీ భారత క్రికెటర్‌ మహేంద్ర సింగ్ ధోని బయోపిక్‌ ‘ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’లో ప్రధాన పాత్ర కోసం తనను తీసుకోవాల్సిందిగా అక్షయ్‌ కుమార్‌ ఆ చిత్ర దర్శకుడు నీరజ్‌ పాండేను కోరినట్లు సమాచారం. ఈ క్రమంలో 2017లో ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్షయ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. ‘నీరజ్‌ పాండే ధోని బయోపిక్‌ తెరకెక్కిస్తున్నారని నాకు తెలిసింది. దాంతో ఆ చిత్రంలో ధోని పాత్ర కోసం నన్ను తీసుకోవాల్సిందిగా నీరజ్‌ను కోరాను. కానీ అతడు సున్నితంగా తిరస్కరించాడు’ అని తెలిపారు. ‘ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’ చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ధోని పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు పొందిన సంగతి తెలిసిందే. (ఐ వాన్న అన్‌ఫాలో యు)

దీనిపై నీరజ్‌ పాండే స్పందిస్తూ.. ‘ఈ చిత్రంలో ధోని యుక్తవయస్సులో వచ్చే సన్నివేశాలు కూడా ఉంటాయి. 16-17 ఏళ్ల యువకుడిగా నటించాల్సి ఉంటుంది. ఆ వెర్షన్‌ అక్షయ్‌కు సూట్‌ కాదు. అందుకే అతడి అభ్యర్థనను తిరస్కరించాను’ అన్నాడు. అంతేకాక ఈ చిత్రంలో సుశాంత్‌ నటన గురించి మాట్లాడుతూ.. ‘తను చాలా మంచి నటుడు. ఈ పాత్ర గురించి చెప్పినప్పుడు సుశాంత్‌ ఎంతో ఉద్వేగానికి లోనయ్యాడు. స్క్రిప్ట్‌ను పూర్తిగా చదివాడు. ధోని బాడీ లాంగ్వేజ్‌ను ఎంతో బాగా అనుకరించాడు’ అని తెలిపారు. ‘ఎమ్‌ఎస్‌ ధోని: అన్‌టోల్డ్ స్టోరీ’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రం 133 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. సుశాంత్ నటనను విమర్శకులు సైతం ప్రశంసించారు. (ఆయన మరణాన్ని నమ్మలేకపోతున్నాం)

Advertisement
 
Advertisement
Advertisement