అందుకే కోర్టును ఆశ్రయించా: నటి

Actress Suchitra Krishnamoorthi Files Case On Ex Husband Shekhar Kapur - Sakshi

గాయని, నటి, రచయిత, చిత్రకారిణి.. ఇలా అన్నిరంగాల్లో అందెవేసిన చేయి సుచిత్రా కృష్ణమూర్తిది. 1997లో ఆమె ప్రసిద్ధ దర్శకుడు శేఖర్‌కపూర్‌ను వివాహమాడారు. వీరికి కావేరీ అనే కూతురు కూడా ఉంది. ఆమె తల్లి నుంచి పుణికి తెచ్చుకున్న కళతో మ్యూజిక్‌ రంగంలో సత్తా చాటుతోంది. కాగా గత కొన్నేళ్ల క్రితమే సుచిత్రా దంపతులు విడిపోయారు. దీంతో కావేరి బాధ్యతలు భుజాన మోస్తూ సుచిత్ర సింగిల్‌ పేరెంట్‌గా బతుకుతున్నారు. ఇదిలా ఉండగా... ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న మూడు పడక గదుల ఫ్లాట్‌లో నటుడు కబీర్‌ బేడి, భార్యతో కలిసి అద్దెకు ఉంటున్నారు. (రాంగోపాల్‌వర్మను పెళ్లి చేసుకోవాలనుకున్నా: సుచిత్ర)

అయితే ఈ ఫ్లాట్‌ తన మాజీ భర్త, దర్శకుడు శేఖర్‌ కపూర్‌కు చెందినదని.. చట్ట ప్రకారం ఇది తమ కుమార్తె కావేరికి చెందుతుందని సుచిత్ర వాదిస్తూ వచ్చారు. తన కూతురు ఉండటానికి ఇల్లు లేదని చెబుతున్నా నాలుగేళ్లుగా కబీర్‌ బేడి ఆ ఇంటిని ఖాళీచేయడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక లాభం లేదనుకున్న ఆమె కోర్టును ఆశ్రయించారు. మాజీ భర్త నుంచి కూతురికి రావాల్సిన ఆస్తి కోసం న్యాయపోరాటానికి దిగారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. మున్ముందు తన కూతురికి ఎలాంటి సమస్యలు తలెత్తకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. ఇప్పటికే దీనివల్ల తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నానని, ఇంతకు మించి ఏమీ చెప్పలేన’ని మాట్లాడటానికి నిరాకరించారు. ఇక ఈ విషయమై చాలాసార్లు శేఖర్‌కపూర్‌కు నోటీసులు పంపించినా స్పందన లేకపోవడంతోనే ఆమె కోర్టును ఆశ్రయించారని సమాచారం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top