ప్రజావాణి అర్జీలు సత్వరమే పరిష్కారం | Sakshi
Sakshi News home page

ప్రజావాణి అర్జీలు సత్వరమే పరిష్కారం

Published Tue, Jan 9 2018 8:26 AM

applications will resolve in prajavani - Sakshi

సిద్దిపేటటౌన్‌: ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిష్కారంలో అధికారులు ఆలస్యం చేయొద్దని, వీలైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను జాయింట్‌ కలెక్టర్‌ పద్మాకర్‌తో కలిసి ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి సోమవారం ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను మళ్లీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారుల ను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో చంద్రశేఖర్, బీసీ, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు రాంరెడ్డి, చరణ్‌దాస్, డీపీవో సురేష్‌బాబు, డీఆర్‌డీవో స్వామి, డీడబ్ల్యూవో జరీనాబేగం, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

చెరువు పనులు ప్రారంభించండి..
చేర్యాల మండలం ముస్త్యా లలో 796 సర్వే నెంబర్‌లో 21 ఎకరాల 34 కుంటల విస్తీర్ణంలో గల పర్రెబావి కుంట ను గ్రామానికి చెందిన కొం దరు కబ్జా చేసి చెరువు కట్టను ధ్వంసం చేశా రు. దీనిపై గతంలో చాలాసార్లు ప్రజావాణి లో ఫిర్యాదు చేశా. దీనిపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి దృష్టికి తీసుకుపోగా స్పందించిన ఆయన చెరువును కబ్జా కాకుండా చూసి అభివృద్ది చేయాలని అధికారులను ఆదేశించారు. రూ.19 లక్షలతో అభివృద్ధి కోసం అంచనాలు వేసినా ఇంతవరకు అధికారులు అభివృద్ది పనులు ప్రారంభించలేదు. కలెక్టర్‌ స్పందించి కుంట అభివృద్ధి పనులు ప్రారంభమయ్యేలా చూడాలి.  – చింతల కిష్టయ్య, ముస్త్యాల

ఉపాధి కల్పించాలి..
నేను చిన్నప్పటి నుంచే వికలాంగుడిని. డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లు పూర్తవుతోంది. నాకు ఏదైనా ఆఫీస్‌లో చిన్న పని కల్పించి నాకు ఆసరా కల్పించాలి. పెన్షన్‌ తీసుకోవడానికి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వికలాంగుల కోటాలో మోటారు సైకిలు మంజూరు చేసి ఇబ్బందులు తొలగించాలి. – హన్మంతరెడ్డి, ఖమ్మంపల్లి

Advertisement
Advertisement