గద్దెలపై బంగారం పోగు పూజారులదే... | Importance of Sammakka Sarakka Bangaram  | Sakshi
Sakshi News home page

గద్దెలపై బంగారం పోగు పూజారులదే...

Jan 13 2018 11:01 AM | Updated on Jan 13 2018 12:04 PM

సాక్షి, ఎస్‌ఎస్‌ తాడ్వాయి: మేడారం జాతరలో సమ్మక్క–సారలమ్మ గద్దెలపై భక్తులు సమర్పించిన ఎత్తు బంగారం (బెల్లం) పోగు చేసుకునే హక్కు స్థానిక ఆదివాసీ యువకులు, పూజారులుదేనని పూజారులు సిద్దబోయిన ముణేందర్, లక్ష్మణ్‌రావు, భోజరావు, నర్సింగరావు, మహేష్‌ అన్నారు. శుక్రవారం వారు విలేకరులతో  మాట్లాడుతూ అమ్మవార్ల గద్దెలపై భక్తులు సమర్పించిన బెల్లాన్ని గతంలో పూజారులు, స్థానిక ఆదివాసీలు ఉచితంగా తీసుకెళ్లేవారమని తెలిపారు. భక్తుల రద్దీ పెరుగుతున్న తరుణంలో గద్దెలపై బెల్లం భారీగా పేరుకుపోవడంతో తొలగించడం కోసం దేవాదాయ శాఖకు ఆర్థిక భారం పడుతుందన్నారు. గత రెండు మూడు జాతరల నుంచి గద్దెలపై బెల్లాన్ని పోగు చేసుకునేందుకు మెయింట్‌నెన్స్‌ ఖర్చుల కోసం దేవాదాయ శాఖకు టెండర్‌ రూపంలో డబ్బులు చెల్లించడం జరుగుతుందని తెలిపారు.

ఈ మేరకు గతంలో జిల్లా కలెక్టర్‌గా పని చేసిన వాకటి కరుణ హయాంలో రాష్ట్రంలో గుడుంబా నిషేధం ఉండడంతో అమె గద్దెలపై బెల్లం టెండర్‌ను పక్కా జిల్లాలో నిర్వహించాలని, అంతే కాకుండా పొరుగు రాష్ట్రంలో ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో విక్రయించుకోవాలని అదేశించారన్నారు. అప్పటి నుంచి పక్క జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడంలోని మణుగూరులో దేవాదాయ శాఖ, ఎక్సైజ్‌ శాఖ అధికారుల సమక్షంలో టెండర్‌ నిర్వహించి స్థానిక ఆదివాసీ యువకులు, పూజారులకే ఇస్తున్నారని తెలిపారు. ఇటీవల నిర్వహించిన గద్దెలపై బెల్లం టెండర్‌లో ఐటీడీఏ పీఓకు కానీ, ఇతర అధికారులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆదివాసీల సంఘాల నాయకులు జాతరలో అమ్మవార్ల పూజా కార్యక్రమాలకు సంబంధించిన విషయాలను పూజారులను సంప్రందించిన తర్వాతే ప్రకటనలు జారీ చేయాలని కోరారు. 

Advertisement
 
Advertisement
Advertisement