సౌదీ మహిళల మరో ముందడుగు
రియాద్ : కట్టుబాట్లకు మారుపేరైన సౌదీ అరేబియా చరిత్రలో సాయంకాలపు బులెటిన్ చదివిన మొట్టమొదటి మహిళా జర్నలిస్టుగా వయీం-ఐ-దాఖీల్ చరిత్ర సృష్టించారు. ప్రభుత్వ చానల్ సౌదీ టీవీ1 లో యాంకర్ ఒమర్-ఐ- నశ్వాన్తో కలిసి ఆమె బులెటిన్ చదివారు. ఉదయపు బులెటిన్ చదివిన మొట్టమొదటి మహిళగా జుమానా-ఐ-షామీ 2016లో చరిత్రకెక్కగా.. ఇపుడు వయీం సాయంకాలపు బులెటిన్ చదివిన మహిళగా రికార్డు సృష్టించారని సౌదీ టీవీ తన అధికారిక ట్విటర్లో పేర్కొంది.
కాగా ‘సౌదీ అరేబియా విజన్- 2030’ కార్యక్రమంలో భాగంగా సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ లింగ వ్యత్యాసాన్ని తొలగించే దిశగా, మహిళల పట్ల సానుకూల వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే సౌదీ ప్రభుత్వం.. మహిళలకు డ్రైవింగ్ చేసే అవకాశాన్ని కల్పించడం, పరుగు పందాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపడుతోంది. అదే విధంగా సెప్టెంబరు మొదటి వారంలో కో- పైలట్లు, ఫ్లైట్ అటెండెంట్లుగా మహిళలకు అవకాశమిస్తున్నట్లుగా రియాద్ కేంద్రంగా పనిచేసే ఫ్లైయాన్స్ విమానయాన సంస్థ ప్రకటించింది.