భారత్‌కు షాకిచ్చిన పాలస్తీనా! | Palestine's Pakistan envoy shares dais with Hafiz Saeed | Sakshi
Sakshi News home page

భారత్‌కు షాకిచ్చిన పాలస్తీనా!

Dec 30 2017 3:29 PM | Updated on Apr 4 2019 3:25 PM

Palestine's Pakistan envoy shares dais with Hafiz Saeed - Sakshi

రావుల్పిండి : అంతర్జాతీయ వ్యవహరాల్లో వెన్నుదన్నుగా ఉన్న అమెరికాను కాదని..  పాలస్తీనాకు భారత్‌ మద్దతిచ్చింది. ఐక్యరాజ్య సమితిలో అమెరికా తీసుకున్న జెరూసలేం నిర్ణయానికి వ్యతిరేకంగా భారత్‌ ఓటేసింది. అంతేకాక జెరూసలేం నిర్ణయాన్నివెనక్కు తీసుకోవాలని అమెరికాను భారత్‌ కోరింది. ఇజ్రాయిల్‌-పాలస్తీనా మధ్య సమతూకం పాటించే విషయంలో భారత్‌ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అవలంబించింది. ఇదంతా జరిగి వారం రోజులు గడవకముందే భారత్‌కు పాలస్తానా భారీ షాక్‌ ఇచ్చింది.  

శుక్రవారం రావుల్పిండిలోని లియాఖత్‌ బాగ్‌లో ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ నేతృత్వంలోని దిఫా ఈ పాకిస్తాన్‌ అనే సంస్థ జెరూసలేం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో పాకిస్తాన్‌లోని పాలస్తీనా రాయబారి వాలిద్‌ అబు వలీ,  నిషేధిత ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌తో కలిసి వేదిక పంచుకున్నారు.  సభ జరుగుతున్న సమయంలో ఇద్దరూ అత్యంత సన్నిహితంగా మాట్లాడుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సభలో మాట్లాడిన వక్తలంతా భారత్‌, అమెరికాలపై తీవ్రమైన విమర్శలు చేశారు. 

హఫీజ్‌ సయీద్‌లో పాలస్తీనా రాయబారి సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో భారత్‌ తీవ్రంగా స్పందించింది.  ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని, నిషేధిత అంతర్జాతీయ ఉగ్రవాదితో పాలస్తీనా రాయబారి అలా వేదిక పంచుకోవడమేంటని భారత విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని భారత్‌లోని పాలస్తీనా రాయబారి, ఆ దేశ అధికారుల దృష్టికి తీసుకెళతామని, దానికి వారు సమాధానం చెప్పాలని మండిపడింది. 

దురదృష్టకరం : పాలస్తీనా
ముంబైదాడుల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌తో కలిసి తమ దేశ రాయబారి వేదికను పంచుకోవడంపై పాలస్తీనా విచారం వ్యక్తం చేసింది. ఇదొక దురదృష్టకర ఘటనగా ఆదేశం అభివర్ణించింది. పాకిస్తాన్‌లోని తమ రాయబారి వాలిద్‌ అబు వలీ ప్రవర్తనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పాలస్తీనా విదేశాంగ శాఖ ప్రకటించింది. భారత్‌ అభ్యంతరాలను గౌరవిస్తామని పాలస్తీనా పేర్కొంది. 

Advertisement
 
Advertisement
Advertisement