కరోనా: న్యూయార్క్‌ గవర్నర్‌ భావోద్వేగం | Sakshi
Sakshi News home page

వెయ్యి మందిని కోల్పోయాం: న్యూయార్క్‌ గవర్నర్‌

Published Tue, Mar 31 2020 3:13 PM

New York Governor Begs for Help As Corona Virus Deceased Toll Climbs - Sakshi

న్యూయార్క్‌: అగ్రరాజ్యం అమెరికాపై కరోనా వైరస్‌(కోవిడ్‌-19)విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే అక్కడ దాదాపు 1.45 లక్షల మంది ఈ మహమ్మారి బారిన పడగా.. దాదాపు 3 వేల మరణాలు నమోదయ్యాయి. ముఖ్యంగా న్యూయార్క్‌, న్యూజెర్సీలపై ఈ ప్రాణాంతక వైరస్‌ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. న్యూయార్క్‌లో ఒక్కరోజే దాదాపు 250 మంది మృత్యువాత పడ్డారు. దీంతో అక్కడ కరోనా మరణాల సంఖ్య 1200కు చేరింది. ఈ నేపథ్యంలో న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్రూ క్యూమో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘‘దయచేసి న్యూయార్క్‌కు సహాయపడండి’’అని సాయం అర్థించారు. ‘‘ఇప్పటికే వెయ్యి మందికి పైగా న్యూయార్క్‌ పౌరులను కోల్పోయాం. ఇప్పటికే పరిస్థితి చేజారిపోయింది. మేం విషాదంలో మునిగిపోయాం’’అని ఆవేదన వ్యక్తం చేశారు. (10 లక్షల మందికి టెస్టులు.. ఇటలీకి భారీ సాయం!)

ప్రస్తుత పరిస్థితుల్లో దాదాపు 10 లక్షల మంది హెల్త్‌ వర్కర్ల అవసరం ఉందని.. వారి సహాయంతో ఈ సంక్షోభం నుంచి గట్టెక్కగలమని పేర్కొన్నారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కాగా కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో దాదాపు 80 వేల మంది రిటైర్డు నర్సులు, డాక్టర్లు, వైద్య నిపుణులు సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. అదేవిధంగా 9/11 ఘటన సమయంలో సేవలు అందించిన నావీ ఆస్పత్రి షిప్పును పట్టణంలోకి తీసుకువచ్చి.. దాదాపు 1000 పడకల సామర్థ్యం ఉన్న ఆస్పత్రిగా తీర్చిదిద్దారు.(11,591 మరణాలు.. లాక్‌డౌన్‌ లేనట్లయితే!!)

Advertisement

తప్పక చదవండి

Advertisement