అఫ్ఘనిస్తాన్లోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులంతా పాకిస్థాన్కు చెందిన వారేనని అఫ్ఘన్ అధికారులు వెల్లడించారు.
నంగర్ హార్: అఫ్ఘనిస్తాన్లోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులంతా పాకిస్థాన్కు చెందిన వారేనని అఫ్ఘన్ అధికారులు వెల్లడించారు. హతమైన ఉగ్రవాదుల నుంచి, తమ ప్రాంతాలు వదిలిపెట్టి పారిపోయిన ఉగ్రవాదుల స్థావరాల నుంచి స్వాధీనం చేసుకున్న కొన్ని పత్రాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అన్నారు. పాకిస్థాన్లోని ఒరగ్జాయ్ అనే గిరిజన ప్రాంతానికి చెందిన వారే ఎక్కువగా ఇస్లామిక్ స్టేట్ లో చేరారని వారు పేర్కొన్నారు.
వీరంతా కూడా పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ కనుసన్నల్లోనే పనిచేస్తుంటారని, వారి ఆదేశాలు కూడా పాటిస్తుంటారని పరోక్షంగా చెప్పారు. అతౌల్లా ఖోగ్యాని అనే అధికారి మాట్లాడుతూ అచిన్, కోట్, హస్కా మైనా ఇతర నంగర్ హార్ ప్రాంతాల్లో చేసిన దాడుల్లో ప్రాణాలుకోల్పోయిన, పట్టుబడిన, పారిపోయిన ఉగ్రవాదుల దగ్గరు నుంచి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నామని, వారంతా పాక్ లోని గిరిజన ప్రాంతాలకు చెందినవారని గుర్తించామని చెప్పారు.