
40 మంది ఉగ్రవాదులకు ఉరిశిక్ష
రెండు సంవత్సరాల కిందట ఇరాక్ లో నరమేధం సృష్టించిన కేసులో నిందితులకు మరణశిక్ష పడింది.
బాగ్దాద్: రెండేళ్ల క్రితం ఇరాక్లో నరమేధం సృష్టించిన కేసులో నిందితులకు మరణశిక్ష పడింది. మొత్తం 47 మందిని విచారించిన బాగ్దాద్ సెంట్రల్ క్రిమినల్ కోర్టు.. వారిలో 40 మందిని దోషులుగా పేర్కొంటూ, ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. ఆధారాలు లేని కారణంగా మరో ఏడుగురిని విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. ఇరాక్ ప్రభుత్వ ప్రతినిధి అబ్దెల్ సత్తార్ బేయర్దార్ ఈ వివరాలను ఓ ప్రకటనలో వెల్లడించారు.
2014 జూన్ నెలలో తిక్రిత్ నగరంలో మిలిటెంట్లు 1700 మందికి పైగా బందీలను హతమార్చిన విషయం తెలిసిందే. ఆ కేసు గురువారం నాడు బాగ్దాద్ కోర్టులో విచారణకు వచ్చింది. ఇరాక్ టెర్రరిస్ట్ వ్యతిరేక చట్టంలోని ఆర్టికల్ 4 కింద నిందితులకు ఈ శిక్ష ఖరారు చేసినట్లు అబ్దెల్ సత్తార్ వివరించారు. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్ (ఐఎస్ఐఎల్) జిహాదీలు ఇరాక్లో మొదలెట్టిన మారణహోమాల్లో తొలి రోజుల్లో జరిగిన దుర్ఘటనలు ఇవి.
మాకు ఏ పాపం తెలియదు: మిలిటెంట్లు
మారణహోమం సృష్టించిన నిందితులను కోర్టులో ప్రశ్నించగా.. తమకు ఏ పాపం తెలియదనే ప్రతి ఒక్కరూ చెప్పారు. అమాయక ప్రజలు, సైనికుల ఊచకోత జరిగిన సమయంలో తాము తిక్రిత్ నగరంలోనే లేమని కొందరు నిందితులు పేర్కొన్నట్లు అధికార ప్రతినిధి లేఖ ద్వారా తెలుస్తోంది. తిక్రిత్ నగరాన్ని 2015 ఏప్రిల్ లో సైనికులు తిరిగి తమ స్వాధీనంలోకి తీసుకున్నారు.