ఇరాక్‌పై దాడులు.. 20 మంది మృతి, మరో 32 మందికి గాయాలు | 20 killed in US Saudi attack on Iraq IRGC targets Jordan | Sakshi
Sakshi News home page

ఇరాక్‌పై దాడులు.. 20 మంది మృతి, మరో 32 మందికి గాయాలు

Jul 29 2026 5:15 PM | Updated on Jul 29 2026 6:22 PM

20 killed in US Saudi attack on Iraq IRGC targets Jordan

బాగ్దాద్: ఇరాక్‌కు చెందిన పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ (పీఎంఎఫ్)పై అమెరికా-సౌదీ దాడుల్లో దాదాపు 20 మంది ఫైటర్స్‌ మరణించారు. మరో 32 మంది గాయపడ్డారు. తమ దళాలు పూర్తి అప్రమత్త స్థితిలో ఉన్నాయని పీఎంఎఫ్ ప్రకటించింది. టెలిగ్రామ్‌లో విడుదల చేసిన ప్రకటనలో పీఎంఎఫ్ స్పందిస్తూ.. "పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ ప్రధాన కార్యాలయాలు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని సౌదీ అరేబియా, అమెరికా చేపట్టిన ద్రోహపూరిత ఉగ్రదాడిని ఖండిస్తున్నాం" అని పేర్కొంది.

పీఎంఎఫ్‌కు ఇరాన్ మద్దతు ఉంది. పీఎంఎఫ్‌ అనేది శిక్షణ పొందిన ఇరాకీ మిలీషియాల సమాఖ్య. ఈ దాడులు అత్యంత ప్రమాదకర ఉద్రిక్తతకు దారితీస్తున్నాయని పీఎంఎఫ్ తెలిపింది. అంతేగాక, ఇవి ఇరాక్ సార్వభౌమాధికారంపై దాడితో పాటు అధికారిక భద్రతా సంస్థల ఉల్లంఘన అని ఆరోపించింది. 2026 ఏప్రిల్ 2న, ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతున్న సమయంలో, మొసుల్ పశ్చిమ ప్రాంతంలో వైమానిక దాడుల్లో మరణించిన పీఎంఎఫ్ ఫైటర్‌ భౌతికకాయాన్ని బాగ్దాద్‌లో పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ సభ్యుడు మోస్తూ కనిపించాడు.

అమెరికా, సౌదీ అరేబియా సంయుక్తంగా విడుదల చేసిన వివరాల ప్రకారం.. అమెరికా దళాలు, సౌదీ చమురు కేంద్రాలపై జరిగిన దాడులకు ప్రతిస్పందనగా మిలిటెంట్లపై ఇరాక్‌లో దాడులు చేపట్టాయి. సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్-మాలికీ కూడా ఇరాన్ మద్దతు ఉన్న ఉగ్ర మిలీషియాలు సోమవారం, మంగళవారం ఇరాక్ భూభాగం నుంచి డ్రోన్లను ప్రయోగించి తూర్పు ప్రాంతం, రియాద్ ప్రాంతాల్లోని చమురు కేంద్రాలపై దాడులు చేశాయని ఆరోపించారు.

సౌదీ అరేబియా తన ఆత్మరక్షణ హక్కు ప్రకారం స్పందిస్తూ ఆ మిలీషియాలకు చెందిన నిర్దిష్ట లక్ష్యాలపై దాడులు నిర్వహించిందని ఆయన చెప్పారు. "సౌదీ అరేబియా రాజ్యం ఉద్రిక్తతలను కోరుకోవడం లేదు. అయితే తమపై జరిగే ఏ దాడికైనా కఠినంగా ప్రతిస్పందిస్తుంది" అని ఆయన అన్నారు. 

బుధవారం ఉదయం విడుదల చేసిన ప్రకటనలో, బాగ్దాద్, వాసిత్, నైనెవెహ్, బస్రా, కిర్కుక్, కర్బలా, దియాలా ప్రావిన్సుల్లోని తమ పలు ప్రధాన కార్యాలయాలపై అమెరికా-సౌదీ దాడులు జరిగాయని పీఎంఎఫ్ తెలిపింది. ఉత్తర ఇరాక్‌లోని నైనెవెహ్, మధ్య ఇరాక్‌లోని దియాలా ప్రాంతాల్లో జరిగిన దాడులే అత్యంత ప్రాణనష్టం కలిగించాయని ఒక అధికారి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement