ఒట్టావా :కెనడాకు చెందిన భారతీయ సంతతికి 16 ఏళ్ల గుర్భాజ్ సింగ్ మౌంట్ హుడ్ పర్వాతిధిరోహణ చేస్తున్న క్రమంలో గాయపడ్డాడు. పర్వతాన్ని అధిరోహిస్తూ 500 అడుగుల లోతుకు జారిపడినట్లు స్దానిక మీడియా ఓ నివేదికలో తెలిపింది. ఆ నివేదిక ప్రకారం.. గుర్భాజ్ సింగ్ మంగళవారం తన మిత్రులతో కలిసి 11,240 అడుగుల ఎత్తైన మౌంట్ హుడ్ అధిరోహించాడు. ఈ క్రమంలో మంచులో పట్టుతప్పి 500 అడుగుల కిందకు జారిపడ్డాడు. దీంతో అతడి కాలుకు గాయమైంది. విషయం తెలుసుకున్న సెర్చ్ అండ్ రెస్క్యూ టీం 10,500 అడుగుల ఎత్తులో చిక్కుకున్న అతన్ని క్షేమంగా బయటకు తీసుకువచ్చింది. పటిష్టమైన శిక్షణ, ధృడమైన హెల్మెట్ ధరించడం వల్ల గుర్భాజ్ తక్కువ గాయాలతో బయటపడ్డాడు.
ఈ ఘటనపై గుర్భాజ్ సింగ్ తండ్రి రిషమ్దీప్ సింగ్ స్పందిస్తూ.. ‘మంచు కారణంగా గుర్బాజ్ ఇబ్బంది పడతాడని భావించా. గుర్బాజ్ గాయం నుంచి కోలుకోగానే అతడితో కలిసి నేను కూడా పర్వతాన్ని అధిరోహిస్తా.’ అని అన్నారు. యూఎస్ ఫారెస్ట్ సర్వీస్ ప్రకారం, మౌంట్ హుడ్ ఒరెగాన్లో ఎత్తైన శిఖరమని, అమెరికాలోనే అత్యధికంగా సందర్శించే శిఖరమని.. ప్రతి సంవత్సరం 10,000 మందికి పైగా ప్రజలు పర్వతాన్ని సందర్శిస్తారని అధికారులు తెలిపారు.