వెల్లింగ్టన్ : పెను భూకంపాలు న్యూజిలాండ్ ద్వీపంలో విధ్వంసం సృష్టిస్తాయని సోమవారం జియాలజిస్టులు హెచ్చరికలు జారీ చేశారు. న్యూజిలాండ్కు చేరువలో ఉన్న హికురంగీ పీఠభూమిలో వస్తున్న కదలికలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నట్లు చెప్పారు. ఈ పెను భూకంపాల ధాటికి న్యూజిలాండ్పై భారీ సునామీలు విరుచుకుపడతాయని వెల్లడించారు.
2011లో జపాన్లో భూకంపం వల్ల వచ్చిన విపత్కర పరిస్థితులు న్యూజిలాండ్లోనూ కనిపిస్తాయని చెప్పారు. కాగా, సోమవారం 4.1 తీవ్రతతో న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్ సాధారణ భూకంపం సంభవించింది. 9.0 కంటే అధిక తీవ్రతతో తొలుత భూకంపాలు సంభవించి, అనంతరం పెను సునామీలు న్యూజిలాండ్ను ముంచెత్తుతాయని జియాలజిస్టులు చెప్పారు. సునామీ నుంచి తప్పించుకునేందుకు న్యూజిలాండ్ ప్రజలకు కేవలం ఏడే నిమిషాలు సమయం ఉంటుందని హెచ్చరించారు.
రెండు టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానిపై మరొకటి చేరడంతో జపాన్ పెను భూకంపం వచ్చినట్లు చెప్పారు. ఇప్పుడు న్యూజిలాండ్ వద్ద కూడా అదే జరగబోతోందని అన్నారు. 2004లో ఇండోనేసియాలోని సుమత్రా దీవుల్లో 9.1 భూకంపం సంభవించి పెను సునామీ 2,50,000 మందిని బలిగొంది.