గ్వడార్‌ పోర్టులో చైనా మరో నిర్మాణం.. ఎందుకోసమో?

China Constructs Security Compound At Gwadar Port Is To Establish Naval Base - Sakshi

న్యూఢిల్లీ: సరిహద్దుల వద్ద భారత్‌తో విభేదాలు తలెత్తిన తరుణంలో చైనా మరింతగా దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో నావికా దళాల్నిమోహరించేందుకు వీలుగా పాకిస్తాన్‌లోని గ్వడార్‌ పోర్టు వద్ద సరికొత్త నిర్మాణాలు చేపట్టినట్లు సమాచారం. తాజాగా విడుదలైన సాటిలైట్‌ చిత్రాల ద్వారా ఈ విషయం వెల్లడవుతోంది. కాగా భారత్‌ అభ్యంతరాలను పక్కనపెట్టిన డ్రాగన్‌.. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) మీదుగా చైనా -పాక్ మధ్య వ్యూహాత్మక ఆర్థిక కారిడార్ (సీపెక్)ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రోడ్లు, నౌకాశ్రయాల వ్యవస్థ ద్వారా యూరప్, ఆసియా, ఆఫ్రికాలతో తన అనుసంధానాన్ని బలోపేతం చేసుకోవడం కోసం చైనా చేపట్టిన అత్యంత భారీ సిల్క్ రోడ్ ప్రాజెక్టులో భాగంగా సీపెక్‌ నిర్మాణాన్ని తలపెట్టింది. (సరిహద్దు ఉద్రిక్తత : మోదీ, ట్రంప్ చర్చ)

కర్టెసీ: సివింట్

ఈ క్రమంలో చైనా పశ్చిమ ప్రాంతం నుంచి పీఓకే మీదుగా అరేబియా సముద్రం తీరంలోని గ్వడార్ పోర్టుకు ఆర్థిక కారిడార్ ఏర్పాటు చేస్తోంది. తద్వారా వాణిజ్య సంబంధాల బలోపేతంతో పాటు ఇరాన్‌ సరిహద్దుల్లో తమ సైన్యాన్ని మోహరించడం సహా... గ్వడార్‌ పోర్టు ద్వారా హిందూ మహా సముద్రంపై పట్టు సాధించేందుకే డ్రాగన్‌ ఈ నిర్మాణాన్ని చేపట్టిందనే సందేహాలు ఉన్నాయి. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో గ్వడార్‌ పోర్టు ద్వారా సైన్యాన్ని తరలించేందుకే చైనా ఈ పోర్టును మరింతగా అభివృద్ధి చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.(పాక్‌లో హిందూ యువతులపై అకృత్యాలు)

ఇదిలా ఉండగా.. సీపెక్‌ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నస్థానిక ప్రజల దాడుల నుంచి తమ ఇంజనీర్లు, ఇతర కార్మికులకు కాపాడుకునేందుకే డ్రాగన్‌ తాజా నిర్మాణాలు చేపట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్‌ కబంధ హస్తాల నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న బలూచి ప్రజల ఆగ్రహ జ్వాలలకు తమ పౌరులు బలైపోకూడదనే ఉద్దేశంతో డ్రాగన్‌ ఈ చర్యకు ఉపక్రమించినట్లు పలువురు భావిస్తున్నారు. 2018లో కరాచిలోని చైనీస్‌ కాన్సులేట్‌పై బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ దాడి చేసేందుకు ప్రయత్నించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top