
పాకిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
లాహోర్: పాకిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో కిక్కిరిసి వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లిన ఘటనలో 24 మంది మృతిచెందారు. మరో 69 మంది తీవ్రంగా గాయపడ్డారు. పంజాబ్ ప్రావిన్స్లోని కోహట్ నుంచి రైవిండ్ వెళ్తున్న బస్సు కహర్ పట్టణ శివారులో అందుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 100 మంది ఉన్నట్లు సమాచారం.
వీరంతా ఓ ధార్మిక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తుండగా బుధవారం అర్థ రాత్రి ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను రావల్పిండి ఆస్పత్రికి తరలించారు. ఓవర్లోడ్, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీస్ అధికారి మొహమ్మద్ అఫ్జల్ తెలిపారు. బస్సు ప్రమాదంపై పంజాబ్ సీఎం విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.