అంత్యక్రియలకు వెళ్తూ.. ముగ్గురి మృతి | three died in road accident | Sakshi
Sakshi News home page

అంత్యక్రియలకు వెళ్తూ.. ముగ్గురి మృతి

Jul 12 2015 5:40 PM | Updated on Aug 30 2018 3:56 PM

బంధువుల ఇంట్లో కర్మకాండలకు వెళ్తున్న ఓ కుటుంబాన్ని మృత్యువు వెంటాడింది.

హయత్‌నగర్ (హైదరాబాద్): బంధువుల ఇంట్లో కర్మకాండలకు వెళ్తున్న ఓ కుటుంబాన్ని మృత్యువు వెంటాడింది. తండ్రి, ఇద్దరు కుమారులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆదివారం తెల్లవారుజామున హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. బోడుప్పల్‌లో నివసించే పోతరాజు చిరంజీవి (48) ఫెనో ప్లాస్టిక్ కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు.

రాజమండ్రిలో బంధువుల ఇంట్లో కర్మకాండలకు హాజరయ్యేందుకు భార్య ఈశ్వరి, కుమారులు కృష్ణ చలపతిశర్మ(16), కృష్ణ గణపతిశర్మ (14)తో పాటు తోడల్లుడు పాలెపు సత్యనారాయణమూర్తి, ఆయన భార్య విమల, కూతురు పరిపూర్ణ, కొడుకు విష్ణులు కారులో తెల్లవారుజామున బోడుప్పల్ నుంచి బయలుదేరారు. బాటసింగారం మౌంట్‌ ఒపెరా దాటిన తరువాత పెట్రోల్‌ బంకు ఎదురుగా విజయవాడ వైపు నుంచి వస్తున్న ఓ ఇసుక లారీ యూ టర్న్ తీసుకుంటుండగా వేగంగా వచ్చిన కారు లారీని వెనుక వైపున ఢీకొంది.

దీంతో కారు డ్రైవ్ చేస్తున్న చిరంజీవి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ చలపతిశర్మ, గణపతిశర్మ ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. ఈశ్వరి, సత్యనారాయణమూర్తి, విమల, పరిపూర్ణ, విష్ణు లను హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ ఆస్పత్రికి తరలించారు. వారిలో విష్ణు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాజమండ్రిలో కర్మకాండలకు, అనంతరం పుష్కరాలకు వెళ్లాలనే ఉద్దేశంతో రెండు కుటుంబాలు పిల్లలతో కలసి కారులో వెళుతున్నారని బంధువులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement