
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవ వేడుకలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ ముస్తాబైంది. ఈ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రాం గం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 9.15 గంటలకు రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి తదితర అంశాలపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారు లు, ఉద్యోగులకు అవార్డులు అందిస్తారు. గణతంత్ర వేడుకల ఏర్పాట్లను ప్రభుత్వ సీఎస్ ఎస్పీ సింగ్ గురువారం పర్యవేక్షించారు.
మహనీయుల ఆశయ సాధనకు కృషి చేద్దాం: గవర్నర్ నరసింహన్
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ నరసింహన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణలో నాల్గవసారి గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నట్లు ఆయన గుర్తు చేశారు. మహనీయుల ఆశయ సాధనకు కృషి చేద్దామన్నారు. ప్రజల ఆకాంక్ష లకు అనుగుణంగా, వారి కలలను సాకారం చేసే విధంగా ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అందిస్తోందని ఆయన పేర్కొన్నారు.
ప్రజలకు సీఎం శుభాకాంక్షలు
తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26న దేశం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటుందని గుర్తు చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా, ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని పిలుపునిచ్చారు.