13వ వసంతంలోకి తెలంగాణ.. రాష్ట్రవ్యాప్తంగా ఘన సంబురాలు | Telangana Marks State Formation Day with Grand Celebrations | Sakshi
Sakshi News home page

13వ వసంతంలోకి తెలంగాణ.. రాష్ట్రవ్యాప్తంగా ఘన సంబురాలు

Jun 2 2026 6:35 AM | Updated on Jun 2 2026 7:24 AM

Telangana Marks State Formation Day with Grand Celebrations

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా నేడు ఘన వేడుకలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ సహా జిల్లా కేంద్రాల్లో జరిగే ప్రధాన కార్యక్రమాలకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు, అధికారులు, వివిధ రంగాల ప్రముఖులు వేడుకల్లో పాల్గొంటున్నారు.

తెలంగాణ అసెంబ్లీలో ఉదయాన్నే వేడుకలు జరిగాయి. శాసనసభ, శాసనమండలిలో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సాధన కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను ఈ సందర్భంగా వాళ్లు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలువురు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

మరోవైపు సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అంతకు ముందు గన్‌పార్క్‌ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం పరేడ్‌ గ్రౌండ్స్‌లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గత ఏడాది పాలన, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్‌ కార్యాచరణపై సీఎం తన సందేశాన్ని ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.

వేడుకల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు సికింద్రాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేస్తున్నారు. బేగంపేట, బోయినపల్లి, తిరుమలగిరి వైపు వెళ్లే మార్గాల్లో మధ్యాహ్నం వరకు వాహనాల రాకపోకలకు పరిమితులు విధించారు. దీంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తిచేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రజా ప్రతినిధుల కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement