తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్‌ ప్రసంగం | Telangana Marks State Formation Day with Grand Celebrations | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్‌ ప్రసంగం

Jun 2 2026 6:35 AM | Updated on Jun 2 2026 12:58 PM

Telangana Marks State Formation Day with Grand Celebrations

సాక్షి, హైదరాబాద్‌: రాచరికాన్ని, పెత్తనాన్ని తెలంగాణ సమాజం సహించదని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉదయం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. అంతకు ముందు.. జాతీయ జెండాను ఎగరేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్‌ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తోంది. ఏ రాష్ట్రంలోనూ లేని సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. తెలంగాణ కల సాకారం చేసిన నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియా గాంధీకి ధన్యవాదాలు. ‘పుట్టుక నీది, చావు నీది.. బతుకంతా దేశానిది’ అని కాళోజీ అన్నారు. కాళోజీ స్ఫూర్తితో.. అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రహితం కోసం పని చేస్తున్నాం. మాది ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చే ప్రజా ప్రభుత్వం. గత 30 నెలల్లో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో విజయవంతమయ్యాం. తెలంగాణ విజన్‌-2047 లక్ష్యం సాధించే దిశగా వెళ్తున్నాం. రైతులను వ్యవసాయ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం.

న్యాయపరమైన సమస్యలు లేకుండా అత్యంత పారదర్శకంగా 67 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేశాం. ఈ నెలలోనే టీజీపీఎస్సీ ద్వారా ఇంజినీరింగ్‌, పీసీబీ, అటవీశాఖ, టౌన్‌ప్లానింగ్‌, విద్యాశాఖలో ఉద్యోగాలకు మరిన్ని నోటిఫికేషన్లు వస్తాయి. ఉద్యోగాల నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. 1,362 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీపైమరీ తరగతులు ప్రారంభించాం. ఈ ఏడాది అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో బ్రేక్‌ఫాస్ట్‌ పెడుతున్నాం. జూనియర్‌ కళాశాల విద్యార్థులకూ మధ్యాహ్న భోజనం అమలు చేస్తాం.

పేదలకు సొంతిళ్లు సాకారం అనేది మాటల్లో చెప్పలేనిది. పేదలను అద్దె ఇళ్ల బాధల నుంచి విముక్తి చేయాలని నిర్ణయించాం. 13 నెలల కాలంలో 1.25 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాం. రూ.22 వేల కోట్లతో పేదల ఇళ్ల కోసం ఖర్చు చేస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ 3.50 లక్షల ఇళ్లను మంజూరు చేశాం. ఈసారి క్యూర్‌ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తాం. పేదలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్‌కార్డులు ఇచ్చాం. అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 

రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని.. ఉత్తమ సేవలు అందించిన పోలీసు అధికారులకు విశిష్టసేవా పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం కంటే ముందు గన్‌ పార్క్‌ వద్ద అమరవీరుల స్థూపం వద్ద పుష్ప గుచ్ఛం ఉంచి ఆయన నివాళులర్పించారు. ఆ సమయంలో సీఎం రేవంత్‌ వెంట పలువురు మంత్రులు, పీసీసీ చీఫ్‌ ఉన్నారు. మరోవైపు.. ఖమ్మం గ్రౌండ్స్‌లో జరిగిన వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తిచేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రజా ప్రతినిధుల కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు జిల్లా కేంద్రాల్లో జరిగే ప్రధాన కార్యక్రమాలకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు, అధికారులు, వివిధ రంగాల ప్రముఖులు వేడుకల్లో పాల్గొంటున్నారు.

CM రేవంత్ రెడ్డి ఆవిర్భావ దినోత్సవ సభ 2026 హైలైట్స్

ఇక.. తెలంగాణ అసెంబ్లీలో ఉదయాన్నే వేడుకలు జరిగాయి. శాసనసభ, శాసనమండలిలో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సాధన కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను ఈ సందర్భంగా వాళ్లు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలువురు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. 

సికింద్రాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు
వేడుకల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు సికింద్రాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేస్తున్నారు. బేగంపేట, బోయినపల్లి, తిరుమలగిరి వైపు వెళ్లే మార్గాల్లో మధ్యాహ్నం వరకు వాహనాల రాకపోకలకు పరిమితులు విధించారు. దీంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement