
రూ. 958 కోట్ల పనులను.. 1638 కోట్లు చేస్తారా!
పురుషోత్తమపట్నం ఎత్తిపోతల అంచనా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా అన్యాయంగా పెంచేసిందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు.
పురుషోత్తమపట్నం ఎత్తిపోతల అంచనా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా అన్యాయంగా పెంచేసిందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. కృష్ణా డెల్టాలో ఇప్పటికీ 1.60 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదని గుర్తుచేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కాలువలు కట్టిస్తుంటే.. ప్రాజెక్టులు కట్టకుండా కాలువలేంటని అప్పట్లో ఎద్దేవా చేశారని, ఇప్పుడు అదే కుడికాల్వ ద్వారా పట్టిసీమ నీళ్లు పారిస్తున్నారని అన్నారు. ఇప్పుడు తాజాగా ఎడమ కాల్వ ద్వారా నీళ్లు విడుదల చేసేందుకు జీవో నెం. 100 ఇచ్చారని, అందులో.. పురుషోత్తమపట్నం నుంచి ఎడమకాలువ ద్వారా గోదావరి నీళ్లు తెస్తున్నామని చెప్పారని తెలిపారు. గతంలో దీని అంచనాలు రూ. 958 కోట్లుగా పేర్కొని. శాఖాపరమైన అనుమతులు తీసుకున్నారని గుర్తుచేశారు. ఇప్పుడు దీనికి 77 శాతం ఎక్సెస్గా రూ. 1638 కోట్లతో అనుమతులు ఇచ్చారన్నారు.. టెండర్లు పిలిచిన తర్వాత ఎక్సెస్ పర్సంటేజి కింద దోపిడీ చేస్తున్నారని తామంతా గొంతులు చినిగేలా పట్టిసీమ గురించి మాట్లాడుతుంటే అది మర్చిపోకముందే ఇంత ఎక్సెస్తో ఇస్తున్నట్లు జీవో ఇవ్వడమంటే ఇంత దారుణమైన దోపిడీ దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఉండదని ఆయన అన్నారు.
రాజధాని నిర్మాణం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం అనుసరించిన స్విస్ చాలెంజ్ విధానాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పుబట్టిందని, అయినా దాని గురించి మాట్లాడకుండా సీల్డ్ కవర్ వ్యవహారాలు నడిపిస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. మొత్తం 1691 ఎకరాలను సీడ్ క్యాపిటల్ కింద సింగపూర్ కంపెనీలకు అప్పగించారని, అంత విలువైన భూములను సింగపూర్ సంస్థలకు కట్టబెట్టడం అవసరమా అని ప్రశ్నించారు. మన ఇంజనీర్లు విదేశాల్లో కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడుతుంటే, వాళ్లను పక్కన పెట్టడమే కాక అవమానించేలా మాట్లాడుతున్నారని.. వాళ్ల ప్రతిభ, సామర్థ్యాలను గుర్తించకపోవడం దారుణమని ఆయన అన్నారు. ఓటుకు కోట్ల కేసులో ముద్దాయి కాబట్టి జైలుకు పోవాల్సి వస్తుందనే హైదరాబాద్ నుంచి అంత అత్యవసరంగా విజయవాడకు వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. అలాంటి చంద్రబాబు.. ఇప్పుడు నల్లధనం విషయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద బురద చల్లుతున్నారని మండిపడ్డారు. ఈయనేదో మాట్లాడటం, ఆ వెంటనే దేవినేని ఉమా, యనమల రామకృష్ణుడు లాంటి మంత్రులు వంత పాడటం.. ప్రతి విషయంలోనూ ఇదే జరుగుతోందని అన్నారు. నల్లధనం గురించి కేంద్రం ప్రకటన చేసిన వెంటనే వీళ్లకు ఆ వివరాలు ఎక్కడినుంచి వచ్చాయని ప్రశ్నించారు.