తాడేపల్లి: సాయికృష్ణ కుటుంబాన్ని సోమవారం వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, తోట త్రిమూర్తులు, సింహాద్రి రమేశ్, అడపా శేషు పరామర్శించారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మితో మాట్లాడి ధైర్యం చెప్పారు. సాయికృష్ణ కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ... ‘‘సాయికృష్ణను చంపేయటంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. అందుకే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనుకున్నాం. తల్లి విజయలక్ష్మికి రూ.20 లక్షల ఆర్థిక సాయం చేశాం. సాయికృష్ణ కేసులో ఇంకా మిస్టరీ వీడలేదు. ఇంకా చాలామంది దోషులు ఉన్నారు.
జగన్ పరామర్శించటానికి వెళ్లేదాకా కేసు కూడా నమోదు చేయలేదు. ఆ తర్వాత సీఐ నాగరాజుని అరెస్టు చేశారేగానీ, ఆయన మొబైల్ ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? మొబైల్ తీసుకుని విచారణ చేస్తే నాగరాజు ఎవరితో మాట్లాడో తెలుస్తుంది? పీఎస్ లో సీసీ కెమెరా ఫుటేజీ ఎవరు మాయం చేశారు? కానిస్టేబుల్ ఫోన్లను లోతుగా విచారించాలి. ఆర్థిక సమస్యల కారణంగా కానిస్టేబుళ్లు ఫోన్లు అమ్ముకున్నారని సిట్ చెప్తోంది.
సిట్ ఎవరిని కాపాడటానికి ఇలా చేస్తోంది? సాయికృష్ణ మీద కేసులు ఉంటే చంపేస్తారా? అనేదే మా ప్రశ్న. సాయకృష్ణ కుటుంబం మీద చాలా ఒత్తిడి చేస్తున్నారు. సీబీఐ విచారణ కోసం కోర్టులో వేసినందుకు ఇంకా ఒత్తిడి చేస్తున్నారు. సాయికృష్ణను చంపేయటంపై మేము పోరాటం చేస్తాం. ఆ కుటుంబానికి అండగా నిలుస్తాం. ఇది ఆ ఒక్క కుటుంబ సమస్యకాదు, సమాజ సమస్య. ఎల్లోమీడియా తప్పుడు కథనాలు రాస్తూ కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తోంది’’ అని చెప్పారు.
ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ.. ‘‘సాయికృష్ణ తల్లికి ఆర్థిక సాయం చేసేందుకు వచ్చాం. సాయికృష్ణ రౌడీ పీటర్ అయితే చంపేస్తారా? ముద్దాయి అయితే బూడిద కూడా ఇవ్వకుండా చేస్తారా? ఈ కేసులో సీఐ నాగరాజు ఒక్కడినే బలి చేయటం కరెక్టు కాదు. సీపీ సహా ఇతర అధికారులను కేసు నుంచి ఎందుకు తప్పిస్తున్నారు? సిట్ పూర్తిస్థాయి విచారణ చేయటం లేదు. పై అధికారుల ప్రమేయం లేకుండా ఈ దారుణం జరుగుతుందా?’’ అని అడిగారు.


