రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు గ్లోబల్ చాంపియన్ ఆఫ్ డిజిటల్ లిటరసీ పురస్కారాన్ని అందుకున్నారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు గ్లోబల్ చాంపియన్ ఆఫ్ డిజిటల్ లిటరసీ పురస్కారాన్ని అందుకున్నారు. సర్టిపోర్ట్ సంస్థ అంతర్జాతీయ విక్రయాల విభాగం ఉపాధ్యక్షుడు జాన్డే చేతుల మీదుగా ఆదివారం బేగంపేటలోని తన నివాసంలో కేటీఆర్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. జాన్ డే మాట్లాడుతూ హైదరాబాద్ నగర వెలుగులు తనను ఎంతో ఆకట్టుకున్నాయని, ఈ పురస్కారానికి కేటీఆర్ అన్ని విధాలుగా అర్హులని అన్నారు. ఈ వివరాలను కేటీఆర్ కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.
అత్యధిక సంఖ్యలో విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించడానికి ప్రపంచ వ్యాప్తంగా కృషి చేస్తున్న ప్రజాప్రతినిధులకు సర్టిపోర్ట్ ఈ పురస్కారాన్ని అందజేస్తున్నది. నూతన ఆవిష్కరణలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు టీ హబ్ ఏర్పాటుతోపాటు రాష్ట్రానికి పెట్టుబడులు తరలివచ్చేందుకు క్రియాశీల పాత్ర పోషించిన కేటీఆర్ కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రంలో డిజిటల్ ఇండియా కార్యక్రమ అమలుకు ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలిపింది. నైపుణ్యాభివృద్ధి కోసం డిజిటల్ తెలంగాణ, యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం టాస్క్ వంటి కార్యక్రమాలను ఆయన చేపట్టారు.