తెలంగాణ సామాజిక, సాహిత్య వికాసానికి వట్టికోట ఆళ్వారుస్వామి చేసిన కృషి మరువలేనిదని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సామాజిక, సాహిత్య వికాసానికి వట్టికోట ఆళ్వారుస్వామి చేసిన కృషి మరువలేనిదని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. ఆళ్వారుస్వామి శతజయంతిని పురస్కరించుకొని సీఎం ఆయనకు ఘననివాళి అర్పించారు. సామాజిక కార్యకర్తగా, ఉద్యమకారుడిగా, సాహితీవేత్తగా, గ్రంథాలయ ఉద్యమసారథిగా బహుముఖ పాత్రలు పోషించిన ఆయన తెలంగాణ జాతి గర్వించదగ్గ యోధుడని కొనియాడారు.
సిటీ సెంట్రల్ లైబ్రరీకి వట్టికోట ఆళ్వారుస్వామి పేరు పెడతామని, అదే ప్రాంగణంలో వట్టికోట విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అలాగే వట్టికోట స్వస్థలం నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం చెరువు మాదారంలో కూడా విగ్రహం పెట్టనున్నట్లు చెప్పారు. వట్టికోట సాహిత్యాన్నంతా ఓ సంకలనంగా మార్చి, తెలుగు అకాడమీ ద్వారా ప్రచురిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.