
విజయవాడ, విశాఖ మెట్రోలకు ‘జైకా’ రుణం
విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టులకు జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ(జైకా) నుంచి రూ.9,971 కోట్లు రుణంగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
రూ.9,971 కోట్లు తీసుకోవాలని నిర్ణయం
కేంద్రానికి రాష్ట్ర సర్కారు ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్: విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టులకు జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ(జైకా) నుంచి రూ.9,971 కోట్లు రుణంగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపించింది. 26.03 కిలోమీటర్ల మేర విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రాజెక్టు నివేదికను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రం వాటా, కేంద్రం వాటా ఎంత? జైకా నుంచి ఎంత రుణం తీసుకోవాలనే వివరాలతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది.
విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు పూర్తి కావడానికి మొత్తం రూ.7.212 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఇందులో జైకా నుంచి రూ.3,600 కోట్లు రుణంగా పొందాలని, కేంద్రం నుంచి రూ.866 కోట్ల నిధులు పొందాలని, రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రూ.866 కోట్లు సమకూర్చనున్నట్లు ప్రతిపాదనల్లో స్పష్టం చేసింది. అలాగే విశాఖపట్నంలో 42 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ప్రాజెక్టుకు జైకా నుంచి రూ.6,371 కోట్లు రుణంగా పొందాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు మొత్తం రూ.13,488 కోట్ల వ్యయం అవుతుందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ వాటా కింద రూ.1,504 కోట్లు, రాష్ట్రప్రభుత్వ వాటా కింద రూ.1,504 కోట్లు సమకూర్చుకోనున్నట్లు ప్రతిపాదించింది.