
చందానగర్లో విషాదఛాయలు
ఆస్ట్రేలియాలో సుప్రజ అనే మహిళ బిడ్డతో సహా అనుమానాస్పదస్పద స్థితిలో మృతి చెందడంతో ఆమె తల్లిదండ్రులు ....
ఆస్ట్రేలియాలో మృతి చెందిన సుప్రజ
27న గృహప్రవేశానికి రావాల్సి ఉండగానే దారుణం
చందానగర్: ఆస్ట్రేలియాలో సుప్రజ అనే మహిళ బిడ్డతో సహా అనుమానాస్పదస్పద స్థితిలో మృతి చెందడంతో ఆమె తల్లిదండ్రులు నివాసం ఉంటున్న చందానగర్ రాజేందర్రెడ్డినగర్ కాలనీలో శుక్రవారం విషాదచాయలు అలుముకున్నాయి. మెదక్ జిల్లా ఆర్డినెస్ ఫ్యాక్టరీ రిటైర్డ్ ఉద్యోగి మంగిడి శంకరయ్య తన కుమార్తె సుప్రజకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు చెందిన శ్రీనివాస్తో 2009లో వివాహం చేశాడు. వీరికి ఐదేళ్ల కుమార్తె సహస్ర, నాలుగు నెలల కుమారుడు ఉన్నారు. సాప్ట్వేర్ ఉద్యోగాల నిమిత్తం ఏడాదిన్నర క్రితం వారు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్కు వెళ్లారు.నాలుగు నెలల క్రితం బాబు జన్మించడంతో శ్రీనివాస్ తల్లిదండ్రులు గంగాధర్, ఇందిర అక్కడికి వెళ్లి నెల రోజుల క్రితమే తిరిగి వచ్చారు. కాగా శంకరయ్య ఇటీవలే రాజేందర్రెడ్డినగర్లో కొత్తగా ఇళ్లు కట్టుకోవడంతో ఈ నెల 27న గృహా ప్రవేశానికి వారిరువు రావాల్సి ఉందని అంతలోనే దారుణం జరిగిందని తల్లిదండ్రులు బోరునా విలపించారు. తమ సమీప బంధువైన అల్లుడు శ్రీనివాస్ చాలా సౌమ్యుడని శంకరయ్య తెలిపారు. కాగా మృతి విషయంపై సమచారం అందడంతో శ్రీనివాస్ తండ్రి గంగాధర్ హుటాహుటిన ఆస్ట్రేలియాకు తరలివెళ్లారు. వారు శుక్రవారం రాత్రి ఆయన అక్కడికి చేరుకునే అవకాశం ఉందని, ఆ తరువాతే పూర్తి వివరాలు తెలుస్తాయని బంధువులు పేర్కొన్నారు.
అన్యోన్యంగా ఉండేవారు: తండ్రి శంకరయ్య
తన ఇద్దరు కుమార్తెలని, అల్లుళ్ల్లు ఇద్దరూ మంచివారని, వారి మధ్య ఎలాంటి గొడవలు లేవని మృతురాలి తండ్రి శంకరయ్య తెలిపారు. తమ గృహ ప్రవేశానికి ఈ నెల 27న బయలుదేరాల్సి ఉందని అంతలోనే ఘోరం చోటు చేసుకుందన్నారు. అక్కడ ఏం జరిగిందో తమకు తెలియదని తమ వియ్యంకుడు గంగాధర్ అక్కడికి చేరుకున్న తర్వాతే అసలు విషయం తెలుస్తోందన్నారు.
పూర్తి సహకారం: కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి
సుప్రజ తల్లిదండ్రులను స్థానిక కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి పరామర్శించారు. సుప్రజ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకుచ్చేందుకు ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. సుప్రజ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను ఆమె ఓదార్చారు.