చలాకీగా ఉండేవాడు.. జీవచ్ఛవంలా మిగిలాడు.. | Gokul chat blast sad story of a man | Sakshi
Sakshi News home page

చలాకీగా ఉండేవాడు.. జీవచ్ఛవంలా మిగిలాడు..

Aug 26 2015 4:39 AM | Updated on Jul 7 2018 2:56 PM

చలాకీగా ఉండేవాడు.. జీవచ్ఛవంలా మిగిలాడు.. - Sakshi

చలాకీగా ఉండేవాడు.. జీవచ్ఛవంలా మిగిలాడు..

ఎనిమిదేళ్ల నాటి దుర్ఘటన వారిని ఇంకా వెంటాడుతునే ఉంది. ఎంటెక్ చదివి ఇంజినీరుగా పనిచేస్తున్న ఆ యువకుడు

 సుల్తాన్‌బజార్ : ఎనిమిదేళ్ల నాటి దుర్ఘటన వారిని ఇంకా వెంటాడుతునే ఉంది. ఎంటెక్ చదివి ఇంజినీరుగా పనిచేస్తున్న ఆ యువకుడు స్నేహితులతో కలిసి చాట్ తిందామని 2007లో ఆగస్టు 25న గోకుల్ చాట్‌కు వచ్చిన అతడు ఉగ్రవాదులు పెట్టిన బాంబు పేలుడులో తీవ్రంగా గాయపడిన  సరూర్‌నగర్ వాసి సదాశివ రెడ్డి(35) ఇప్పుడు వికలాంగుడిగా మిగిలాడు. కదలలేని స్థితిలో ఉన్న అతడిని చూస్తూ కన్నవారు తట్టుకోలేక పోతున్నారు. నాటి దుర్ఘటనలో ప్రాణాలు పోగొట్టుకున్న వారికి నివాళులు అర్పించేందుకు మంగళవారం సదాశివరెడ్డి తల్లిదండ్రులు మోహన్‌రెడ్డి, వసంత సహాయంతో కోఠి గోకుల్ చాట్‌కు వచ్చాడు.

నాటి బాంబు పేలుళ్లలో అన్ని అవయవాలు చచ్చుబడిపోయాయని తల్లి రోదించడం అందరినీ కలిచివేసింది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి తక్షణ సహాయం కింద రూ. 20 వేల చెక్కు ఇచ్చారని, వైద్య ఖర్చులు భరిస్తామని, ప్రభుత్వ ఉద్యోగం, రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని వైఎస్ హామీ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ చొరవతో తన రెండో కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందన్నారు. వైస్సార్ అకాల మరణంతో వైద్య ఖర్చులు చెల్లించకపోవడంతో నాంపల్లి కేర్ ఆసుపత్రి నుంచి ఇంటికి పంపేశారని, తమకు ఇస్తామన్న ఎక్స్‌గ్రేషియా, వైద్య సదుపాయాలు లే వని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు. మరో బాధితుడు సయ్యద్ రెహమాన్ గోకుల్ చాట్ వద్ద నివాళులు అర్పించారు. నాటి పేలుడులో తనకు కన్ను పోయిందని, ప్రభుత్వం వికలాంగ ఫించన్, ఇల్లు, జిరాక్స్ మిషన్ ఇచ్చి ఆదుకోవాలని అక్కడ బ్యానర్ ప్రదర్శించాడు.

Advertisement
 
Advertisement
Advertisement