నేను పోలీసును..వాహనపత్రాలు చూపించడని’ ఓ వృద్ధుడి నుంచి రూ.2.90 లక్షలు కాజేసిన ఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది.
నాగోలు: ‘నేను పోలీసును..వాహనపత్రాలు చూపించడని’ ఓ వృద్ధుడి నుంచి రూ.2.90 లక్షలు కాజేసిన ఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. ఉప్పల్ ప్రశాంత్నగర్కు చెందిన పెద్దిబొట్ల భాస్కరశర్మ (79) రిటైర్డ్ లెక్చరర్. స్థానికంగా ఫ్లాటు కొనుగోలు చేసేందుకు చైతన్యపురిలోని ఆంధ్రాబ్యాంకు, ఎస్బీహెచ్లకు వెళ్లి మంగళవారం రూ.2.90 లక్షలు డ్రా చేసుకొని..తన స్కూటీ (ఏపీ29ఏపీ 9714) డిక్కీలో పెట్టారు.
తన వాహనంపై ఉప్పల్కు వెళ్తుండగా నాగోలు బ్రిడ్జి సమీపంలోకి రాగానే బైక్పై వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి తాను పోలీసునని భాస్కరశర్మను పరిచయం చేసుకుని వాహనం పత్రాలు చూపించాలని అడిగాడు. అనంతరం మీ వాహనంలో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారమందిందని, వాహనాన్ని తనిఖీ చేయాలని డిక్కీ తెరిచాడు. అప్పటికే డిక్కీ కవర్లో ఉన్న రూ.2.90 లక్షలు తీసుకొని రెప్పపాటులో ఉడాయించాడు. ఘటన నుంచి తేరుకున్న భాస్కర్శర్మ వెంటనే ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఘటనలో టాస్క్ఫోర్స్ పోలీసునంటూ..
ఖైరతాబాద్: గతంలో బ్రోకర్ కేసులో అరెస్టయ్యావు..నీపై కేసులున్నాయని ఓవ్యక్తిని తాను టాస్క్ఫోర్స్ పోలీసునంటూ నమ్మించి డబ్బులు వసూలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బాగ్అంబర్పేట్లో నివాసముండే కలహరిరెడ్డి(24) ఈవెంట్ మేనేజర్ . చెన్నమల్లప్ప అనే వ్యక్తికి తాను టాస్క్ఫోర్స్ పోలీసునని బెదిరించి..నీవు గతంలో బ్రోకర్ కేసులో అరెస్టయ్యావు..అయినా అదే దందా కొనసాగిస్తున్నావు మళ్లీ నీపై కేసు లేకుండా చేయాలంటే రూ.లక్ష కావాలని చెన్నమల్లప్పను డిమాండ్ చేశాడు.
దీంతో ఈనెల 15న షాదాన్ కాలేజీ సమీపంలోని కుషాల్ టవర్స్ వద్దకు స్కార్పియోకారు (ఎపి36ఎఫ్6688)లో వచ్చి చెన్నమల్లప్ప వద్ద ఉన్న రూ.30వేల నగదు, ఏటీఎం కార్డులోంచి మరో రూ.7వేలు తీసుకున్నాడు. ఆ తర్వాత కూడా డబ్బులివ్వాలంటూ వేధిస్తుండడంతో అనుమానంతో చెన్నమల్లప్ప సోమవారం సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. నిఘా ఉంచిన పోలీసులు మంగళశారం కలహరిరెడ్డిని అరెస్ట్చేసి అతడ్నించి రూ.37వేలు నగదు, సెల్ఫోన్, కారును స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు.