ముదిరాజ్‌లకు ఐదెకరాల స్థలం.. రూ.5 కోట్లు | 5 crore for Mudirajs | Sakshi
Sakshi News home page

ముదిరాజ్‌లకు ఐదెకరాల స్థలం.. రూ.5 కోట్లు

Feb 28 2018 2:24 AM | Updated on Aug 15 2018 9:04 PM

5 crore for Mudirajs - Sakshi

హైదరాబాద్‌: ముదిరాజ్‌ల కోసం రాష్ట్ర ప్రభుత్వం నగరంలోని కోకాపేట సమీ పంలో అత్యంత విలువైన ఐదెకరాల స్థలం, రూ.ఐదు కోట్ల నిధులను కేటాయిస్తూ ఈ నెల 26న జీవో నంబర్‌ 4 విడుదల చేసింద ని తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ బండా ప్రకాశ్‌ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ చొప్పరి శంకర్‌ ముదిరాజ్‌ తెలిపారు. తమ సంక్షేమం, అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ చేస్తున్న కృషికి కృతజ్ఞతా పూర్వకంగా మంగళవారం నారాయణగూడలోని ముదిరాజ్‌ మహాసభ కార్యాలయం వద్ద కేసీఆర్‌ చిత్రపటానికి ముదిరాజ్‌లు పాలాభిషేకం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో సీఎం కేసీఆర్‌కు పాలాభిషేకాలు, మిఠాయిల పంపిణీ, ఆసుపత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీ లాంటి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ముదిరాజ్‌లకు కేటాయించిన స్థలంలో త్వరలోనే సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు. మత్స్యకారులకు రాష్ట్ర వ్యాప్తంగా 650 కమ్యూనిటీ భవనాలను ప్రభుత్వం మంజూరు చేసిందని, ఒక్కో భవన నిర్మాణానికి రూ.10 లక్షలు కేటాయించిందన్నారు. ముదిరాజ్‌లు, మత్స్యకారుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లకు కూడా వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మహాసభ ప్రతినిధులు నీల రాములు, ప్రొఫెసర్‌ దినేశ్, సాంబయ్య, డి.వెంకటేశ్, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement