నారావారి సాము ‘గరుడ’లు!

k Ramachandra Murthy Article On Chandrababu Naidu Over Court Notices - Sakshi

త్రికాలమ్‌

కాదేదీ కవితకనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. కాదేదీ ప్రచారానికనర్హం అంటున్నారు నారా చంద్రబాబునా యుడు. న్యాయవ్యవస్థ పనితీరు తెలిసినవారు ఎవరైనా  రెండు రోజులుగా చంద్రబాబు, ఆయన సహచరులూ ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో మాట్లాడుతున్న తీరు చూస్తే వీళ్ళకి మతులు పోయాయని నిర్ధారించుకుంటారు. రాజ కీయం ఇంతగా దిగజారిపోయిందేమిటని బాధపడతారు. గోరంత విషయాన్ని కొండంత చేస్తున్నందుకు ఆగ్రహి స్తారు. న్యాయవ్యవహారాలు తెలియనివారు మాత్రం ప్రధాని నరేంద్రమోదీకీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికీ మధ్య భీకర సమరం సాగుతున్నదని భ్రమి స్తారు.

మోదీ అన్ని పనులూ పక్కన పెట్టి, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాను పిలిపించుకొని గంటలకొద్దీ సమాలోచనలు జరిపి, ఇద్దరూ  మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో మాట్లాడిన ట్టూ, ఫడ్నవీస్‌ నాందేడ్‌ జిల్లాలోని ధర్మాబాద్‌లో ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌తో కలిసి రాజకీయకుట్ర చేసి చంద్ర బాబును అరెస్టు చేయడానికి పన్నాగం పన్నినట్టూ, అందులో భాగంగానే నాన్‌బెయిలబుల్‌ వారెంటు పంపి నట్టూ అపార్థం చేసుకొని అనవసరంగా ఆవేశపడతారు.  ఇటువంటì  వారెంట్లకూ, అరెస్టులకూ తాను భయపడేది లేదని కర్నూలు జిల్లా సున్నిపెంటలో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఉపముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి, మంత్రులు కళావెంకటరావు, యనమల రామకృష్ణుడు, నారాయణ, పత్తిపాటి పుల్లారావు, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతి రాజు, మాజీ ఎంపీ నామానాగేశ్వరరావు తక్కుంగల నేత లందరూ నాన్‌బెయిలబుల్‌ వారెంటు మోదీ పనేనంటూ ప్రకటించారు. తాను మరోసారి ప్రధాని కాకుండా చంద్ర బాబు అడ్డుకుంటారనే భయంతో మోదీ కుట్ర చేసి తమ నాయకుడిని వేధించాలని ప్రయత్నిస్తున్నారనీ, మోదీ ఆటలు సాగవనీ, అంతు చూస్తామనీ వారంతా ముక్తకం ఠంతో హెచ్చరించారు. అంతటితో ఆగకుండా, బాబ్లీ ప్రాజెక్టును వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమర్థించారని చంద్ర బాబు ఆరోపించారు. వైఎస్‌  2009లో దివంగతుడైన విష యం ముఖ్యమంత్రి మరచిపోయారు.

మీడియా సహకారం
చంద్రబాబుకు అరెస్టు వారెంట్‌ వార్తను మీడియా సమ ధికోత్సాహంతో పతాక శీర్షికలతో, పొలికేకలతో ప్రకటించి, ప్రసారం చేసి రెండు తెలుగు రాష్ట్రాలలో యుద్ధవాతా వరణం సృష్టించింది. చంద్రబాబును ఒక వైపు నరేంద్ర మోదీతోనూ, రెండో వైపు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనూ, ఇంకోవైపు కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌) తోనూ త్రిముఖంగా పోరాడుతున్న యోధానయోధుడుగా ప్రజలు గుర్తించి ఆయనను  రాబోయే  ఎన్నికలలో కూడా గెలిపిం చాలని బాబు మిత్రుల ఆకాంక్ష. అసలు విషయం ఏమి టంటే వడ్ల గింజలో బియ్యపు గింజ. పత్రికలూ, వార్తాచా నళ్ళూ నిర్వహించేవారికి నాన్‌బెయిలబుల్‌వారెంట్‌ (ఎన్‌బీ డబ్ల్యూ) కొత్తకాదు. నాకు అనేక సందర్భాలలో ఎన్‌బీ డబ్ల్యూ వచ్చింది. ఒకసారి ఇద్దరు పోలీసు అధికారులు సరాసరి మా కార్యాలయంలో నా గదిలోకి వచ్చి నాకు ఎదు రుగా కూర్చొని ఆశ్చర్యపరిచారు.

ఎన్‌బీడబ్ల్యూ చూపిం చారు. మా లాయర్‌ నుంచి కానీ, రిపోర్టర్‌ నుంచి కానీ నాకు సమాచారం బొత్తిగా లేదు. మర్నాడు కోర్టుకు హాజ రవుతానని చెప్పి వారిని పంపించాను. కోర్టుకు హాజరై నాను. ఇతర సంపాదకులకూ, పత్రికాధిపతులకూ పరువు నష్టం దావాలలో కోర్టుకు హాజరు కాలేకపోయిన పరిస్థితు లలో ఎన్‌బీడబ్ల్యూ రావడం, దిరిమిలా కోర్టుకు హాజరు కావడం లేదా న్యాయవాదిచేత దరఖాస్తు చేయించడం, ఎన్‌బీడబ్ల్యూను ‘రీకాల్‌’ చేయించుకోవడం సర్వసాధా రణం. ఇది చాలా చిన్న విషయం. అటువంటి ఎన్‌బీడబ్ల్యూ ఒకటి చంద్రబాబుకీ, మరి కొంతమందికీ 37వ సారి వచ్చింది. ధర్మాబాద్‌ మెజిస్ట్రేట్‌ ఎన్‌ఆర్‌ గజఖియే జులై 5న తాజా వారెంట్‌ పంపించాలని ఆదేశించారు. దాని ప్రకారం ఆగస్టు 16 నిందితులు హాజరు కావాలి. కానీ తేదీని చేతితో కొట్టివేసి సెప్టెంబర్‌ 21న హాజరు కావాలని ఆదేశిస్తూ పంపిన తాఖీదు రెండు రోజుల కిందటే అందినట్టు ప్రచారం. 2010లో గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టు నిర్మిస్తున్న సందర్భంలో అప్పుడు ప్రతి పక్షంలో ఉన్న చంద్రబాబు పార్టీ సహచరులతో వెళ్ళి ధర్నా చేశారు.

మహారాష్ట్ర పోలీసులు టీడీపీ నాయకులను అరెస్టు చేసి పుణె జైలుకు తరలించారు. అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్‌లో దింపారు. భారత శిక్షాస్మృతి కింద మహా రాష్ట్ర పోలీసులు కేసులు పెట్టారు. విచారణ 2013 ఆగ స్టులో ప్రారంభమైంది. నిందితులు కోర్టుకు హాజరు కావడం లేదనే కారణంపైన 2015 సెప్టెం» ర్‌ 21 మొద టిసారి ఎన్‌బీడబ్ల్యూ జారీ చేశారు. ఆ తర్వాత 35 సార్లూ ఎన్‌బీడబ్ల్యూ జారీ చేస్తూ వచ్చింది ధర్మాబాద్‌ కోర్టు. ఎనిమిదేళ్ళుగా అదే కోర్టులో కేసు నలుగుతూ ఉన్నది. ఎన్‌బీడబ్ల్యూ జారీ చేయడమే కానీ దాన్ని అమలు చేసే ఉద్దేశం కోర్టుకు ఉన్నట్టు లేదు. మన న్యాయవ్యవస్థ పని తీరుకు ఇది ప్రబల నిదర్శనం. టీడీపీకి చెందిన ఇద్దరు మంత్రులు ఎన్‌డీఏ భాగస్వాములుగా ఉన్న కాలంలోనే 35 ఎన్‌బీడబ్ల్యూలు వచ్చాయి. బుట్టదాఖలైనాయి. కానీ 37వ ఎన్‌బీడబ్ల్యూని రాజకీయంగా వినియోగించుకోవాలనే మెరుపులాంటి ఆలోచన చంద్రబాబుకి వచ్చినట్టుంది.

తెలంగాణ కోణం
నరేంద్రమోదీపైన వ్యతిరేకత సృష్టించడం ఒక్కటే లక్ష్యం కాదు. తెలంగాణ ఎన్నికలలో ఈ అంశాన్ని తురుపు ముక్కగా ఉపయోగించుకోవాలని సంకల్పం. 1995లో ఎన్‌టి రామారావును గద్దె దింపడానికి వైస్రాయ్‌ హోట ల్‌లో జరిగిన నాటకంలో సహకరించిన శక్తులు ఇన్నేళ్ళు గడిచినా చంద్రబాబుతోనే మరింత అంకితభావంతో కొన సాగడం విశేషం. అందుకే ఆయనకు ఏ ఆలోచన వచ్చినా వెంటనే అమలు చేసి ఫలితాలు సాధించగలుగుతున్నారు. ఆయన ‘తందానా’ అంటే ‘తానతందనానా’ అంటూ దరువు వేయడానికీ, బృందగానం చేయడానికి వెరపులేని మీడియా సిద్ధంగా ఉంటుంది. న్యాయవ్యవస్థలో కార్యసా ధనకు అవసరమైన శక్తియుక్తులున్నాయి. టీడీపీలో ఆయన మాటకు ఎదురు చెప్పే చేవ ఉన్నవారు ఎవ్వరూ లేరు. నాయకుడు ఏ పాట పాడమంటే ఆ పాట పాడుతారు. ఏ ఆట ఆడమంటే ఆ ఆట ఆడతారు. 

తెలంగాణలో ఆధిక్యాన్ని ప్రదర్శించుకోవడానికి చంద్రబాబు మరో ప్రయత్నం చేస్తున్నారు.  ‘ఓటుకు కోట్ల’ కేసు తర్వాత బతుకుజీవుడా అంటూ ఉమ్మడి రాజధాని వదిలి అమరావతికి మకాం మార్చిన బాబు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు.  తనపైన కేసీఆర్‌ది పైచేయి అయింది. అందుకు ప్రతీకారంగా కేసీఆర్‌ని ఓడించేందుకు కాంగ్రె స్‌తో చేతులు కలపాలని నిర్ణయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు గడువు ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి కనుక ముందస్తు ఎన్నికలకు వెడుతున్న తెలంగాణలో మరోసారి కాలుమోపడానికి ప్రయత్నం చేయాలని ఆరా టపడుతున్నారు. అందుకే వారం రోజుల కిందట హైదరా బాద్‌లో టీఆర్‌ఎస్‌లోకి వలస పోగా మిగిలిన కొద్దిమంది టీడీపీ నాయకులతో సమాలోచనలు జరిపి కమిటీలు వేసి హడావిడి చేశారు.

తెలంగాణ ఎన్నికలలో టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ కూటమికి తానే సారథ్యం వహిస్తున్నట్టు కనిపిం చడం చంద్రబాబు ఉద్దేశం. పెద్దపార్టీగా చొరవ తీసుకో వాలన్న అభిలాష ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేదు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణకు బాధ్యతలు అప్పగించి చంద్ర బాబు అమరావతికి వెళ్ళిపోయారు. ఎందుకైనా పనికి వస్తుందని ఒక సైడ్‌షోను శివాజీ అనే నటుడితో ‘ఆపరేషన్‌ గరుడ’ అనే ఒకానొక ఊహాజనిత ప్రాయోజిత కార్యక్ర మాన్ని కొన్ని మాసాల కిందటే ఆరంభింపజేశారు. దాన్ని మహారాష్ట్ర కోర్టు నుంచి వచ్చిన ఎన్‌బీడబ్ల్యూకు ప్రచారం ఇవ్వడానికి వినియోగించుకున్నారు. ఈ విధంగా మేథోక్రీడ ఆడటం టీడీపీ అధినేతకు అలవాటే.

అవే ఎత్తుగడలు, అవే వ్యూహాలు
వైస్రాయ్‌ డ్రామాలో సైతం ఇదే రకమైన ఎత్తుగడలు అమలు పరిచారు. లేనిది ఉన్నట్టూ, ఉన్నది లేనట్టూ నమ్మించడం ఈ క్రీడలో ్రçపధానం. ఎన్టీఆర్‌ను భార్యా విధేయుడుగా, అసమర్థుడుగా, లక్ష్మీపార్వతిని దుష్టశక్తిగా నమ్మించడానికి వినియోగించిన తంత్రాన్నే ఇప్పుడు మోదీతో తాను యుద్ధం చేస్తున్నట్టు ప్రజలు విశ్వసించే విధంగా నాటకం రక్తికట్టించేందుకు యధాశక్తి ఉపయో గిస్తున్నారు. అన్నివేళలా వ్యూహాలు ఫలించవు. 1995లో ఫలించిన వ్యూహం 2004లోనూ, 2009లోనూ పారలేదు.  2014లో ఫలించి స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కడచిన నాలు గేళ్ళుగా ప్రజలు రకరకాల అనుభవాల  నుంచి గుణ పాఠాలు నేర్చుకున్నారు. అందుకే ‘యాక్సిస్‌ మై ఇండియా’ ‘ఇండియాటుడే’ సంస్థ కోసం చేసిన సర్వేలో భావి ముఖ్య మంత్రి ఎవరనే ప్రశ్నకు 43 శాతం మంది వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని బదులిస్తే 38 శాతం మంది మాత్రమే చంద్రబాబు అని చెప్పారు. శనివారంనాడు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు నిర్వహించిన బహిరంగ సభకు గణనీయమైన సంఖ్యలో జనం హాజరు కావడం కూడా ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉన్నదన డానికి నిదర్శనం.

రాబోయే ఎన్నికల దృష్ట్యా బాబ్లీ బరాజ్‌ నిర్మాణం సమయంలో టీడీపీ చేసిన ధర్నాను తిరిగి ప్రజ లకు గుర్తు చేయడం అవసరమని చంద్రబాబు భావించి ఉంటారు. గోదావరిపైన మరో ప్రాజెక్టు వస్తే ఉత్తర తెలంగాణ బీడైపోతుందన్న ఆవేదనతో  ఆ నాడు తాను మహారాష్ట్ర వెళ్ళి ఆందోళన చేశానని చెప్పుకోవడానికి ఎన్‌బీడబ్ల్యూ ఆయనకు ఒక సందర్భాన్ని ప్రసాదించింది. ఒక వైపు ఆపరేషన్‌ గరుడ, మరోవైపు ఆపరేషన్‌ ఎన్‌బీడబ్ల్యూ కొనసాగిస్తూనే ఇంకోవైపు ఆపరేషన్‌ ఇంటెలిజెన్స్‌కు తెరలేపారు. సిబ్బందితో సహా హైదరాబాద్‌లో మకాం వేసి ఏయే నియోజకవర్గాలలో టీడీపీ అభ్యర్థులు గెలిచే అవ కాశం ఉన్నదో పరిశీలించమని ఆంధ్రప్రదేశ్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం అధిపతి వెంకటేశ్వరరావుకు పురమాయించారు. టీడీపీ ఓటు బ్యాంకు 31 శాతం చెక్కు చెదరలేదంటూ మొన్న హైదరాబాద్‌ సందర్శన సందర్భంగా రమణ చేత ఒక ప్రకటన చేయించారు.

కనీసం 50 నియోజకవర్గాలలో టీడీపీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు కనిపిస్తాయంటూ వెంకటేశ్వరరావు చేత నివేదిక ఇప్పించుకుంటారు. ఈ రెండు అంశాలు ప్రాతి పదికగా కాంగ్రెస్‌తో సీట్ల బేరం పెడతారు. అమరుల ఆకాంక్షల ఆధారంగా ఎజెండా తయారు చేసుకొని కోదండరామ్‌ కూడా ఈ కూటమిలో భాగస్వామి కావ డానికి సిద్ధంగా ఉన్నట్టున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చినట్లయితే టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇస్తాయి. ఈ పరి ణామాలను కేసీఆర్‌ చూస్తూ ఊరుకుంటారా? కాంగ్రెస్‌ నాయకుడు జగ్గారెడ్డిపైన, రేవంత్‌రెడ్డిపైన కేసులు తిరగ దోడటంలోని ఆంతర్యం ‘ఓటుకు కోట్ల’ కేసు గురించి చంద్రబాబుకి సంకేతం పంపడమేనని ఒక వాదన. ‘తెలం గాణలో నువ్వు వేలు పెడితే ఆంధ్రప్రదేశ్‌లో నేను కాలు పెడతా’ అంటూ ఇప్పటికే కేసీఆర్‌ చంద్రబాబుని హెచ్చ రించారంటూ రాజకీయవర్గాలలో చెప్పుకుంటున్నారు.

కాంగ్రెస్‌ అధి ష్ఠానంలో కూడా రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. టీడీపీ ఎక్కువ సీట్లు అడిగితే ఇవ్వకూడదనీ, కాంగ్రెస్‌కి విజయావకాశాలు ఉన్న సీట్లను వదులు కోకూడదనీ మొన్న రాహుల్‌గాంధీ తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులతో స్పష్టంగా చెప్పారు. ఒక వేళ టీడీపీ పొత్తుకు నిరాకరిస్తే కాంగ్రెస్‌కి నష్టం లేదనీ, టీఆర్‌ఎస్‌కు వెళ్ళ వలసిన నాయకులందరూ వెళ్ళిపోయారనీ, మిగిలినవారు కాంగ్రె‹ Üలో చేరి కాంగ్రెస్‌ ఎన్నికల చిహ్నంపైన పోటీ చేయడమే మేలు అనే అభిప్రాయంలో ఉన్నారనీ కొందరు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌తో చెప్పారు. తెలంగాణలో అస్తి త్వంకోసం, రెండు కళ్ళ సిద్ధాంతం కొనసాగించడంకోసం చంద్రబాబు తక్కువ స్థానాలతో సరిపెట్టుకుంటే కూట మిలో ఉండటానికి కాంగ్రెస్‌కి అభ్యంతరం ఉండదు. జాతీయ పార్టీ అయినప్పటికీ కాంగ్రెస్‌ బిహార్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాలలో జూనియర్‌ భాగ స్వామిగా సర్దుకుపోతున్నది. తెలంగాణలో మిగిలిన ఇద్దరు టీడీపీ ఎంఎల్‌ఏలలో ఎల్‌బీనగర్‌ శాసనసభ్యుడు కృష్ణయ్య సొంత పార్టీ పెట్టుకుంటానంటున్నారు. సత్తుపల్లి ఎంఎల్‌ఏ సండ్రవెంకటవీరయ్య మాత్రమే మిగిలారు. ఆయన కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాబల్యంతో గెలిచారు. రక రకాల పనికిమాలిన ‘ఆపరేషన్లు’ నడిపిస్తూ అలవి కాని చోట అధికులమనడం అవివేకమని టీడీపీ అధినేత గుర్తిస్తే ఆయనకే మంచిది.

-కె. రామచంద్రమూర్తి

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top