
యువ ప్రదీపం ఆరిపోయింది!
మొన్న దీపావళికి ఇంటికొస్తానన్న కొడుకు రాలేదు. వెలుగూ రాలేదు. ఏమైందోనని ఆందోళనతో ఫోన్ చేస్తే... ఫోన్ స్విచ్చాఫ్. రాత్రంతా నిద్రలేదు.
మొన్న దీపావళికి ఇంటికొస్తానన్న కొడుకు రాలేదు. వెలుగూ రాలేదు. ఏమైందోనని ఆందోళనతో ఫోన్ చేస్తే... ఫోన్ స్విచ్చాఫ్. రాత్రంతా నిద్రలేదు. తెల్లారినా బిడ్డ రాలేదు. కానీ ఓ కబురు వచ్చింది... ఎక్కడో కశింకోటలో ఎవరో అమ్మాయి గురించి అక్టోబర్ 28 శుక్రవారం సాయంత్రం గొడవైంది.. అక్కడ ఇరవై... పాతికమంది కుర్రోళ్లు కలిసి తమ బిడ్డ ప్రదీప్ను కలబడి కొట్టారని! ఆ తల్లి మనసు తల్లడిల్లింది. భర్త, బంధువులు... విశాఖపట్నం జిల్లాలోనే విశాఖ సమీపంలోని అగనంపూడి పంచాయతీలోని దానబోయినపాలెం గ్రామస్థులు, స్నేహితులు కలిసి బిడ్డ ఆచూకీ కోసం కశింకోటకెళ్లారు. పోలీసులు వాచీ, చైన్ చూపించి... ‘ఇవి మీవాడివేనా’ అని అడిగారు. ‘మా బిడ్డవేనండి... ఏమైంది?’ అని అడిగితే, ‘ఎవరో ఇచ్చి వెళ్లారు. మీవాడివైతే తీసుకువెళ్లండి’ అని కసురుకున్నారు. కనీసం మిస్సింగ్ కేసు పెట్టమన్నా కుదరదన్నారు. ఆ తర్వాత సోమవారం రాత్రి అనకాపల్లి సమీపంలోని ఉమ్మలాడ వద్ద శారదా నదిలో ఆ కుర్రాడు శవమై తేలాడు. మృతదేహం ఉబ్బిపోయింది. పచ్చబొట్టు చూసి.. అది తన బిడ్డ శవమేనని గుర్తించారు. షాక్కు గురైన తండ్రి నేటికీ తేరుకోలేదు.. ఇక గుండెలవిసేలా రోదిస్తున్న ఆ అమ్మను ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు.
ఆ తల్లితండ్రుల పుత్రశోకం వెనుక ఆ బిడ్డ అమాయకపు ప్రేమ తప్ప మరేదీ లేదు. ఆ కుర్రాడు ప్రేమించిన అమ్మాయినే మరొక బలవంతుడు ఇష్టపడ్డాడు. అదే ఆ కుర్రాడు చేసిన నేరమైంది. ఆ బలవంతుడికి అధికార పార్టీ అండగా నిలిచింది. గూండాలకు టీడీపీ ప్రజాప్రతినిధులు రక్షణగా నిలిచారు. ప్రేమించిన అమ్మాయితో మాట్లాడుతుండగానే, జనమంతా చూస్తుండగానే నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపేశారన్న వాదనలు ఉన్నాయి.
అసలేం జరిగిందంటే..
అవంతి కళాశాలలో కశింకోటకు చెందిన ఓ యువతి బీటెక్ సెకండియర్ చదువుతోంది. అదే కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న అగనంపూడి పంచాయతీ, దానబోయినపాలెం గ్రామానికి చెందిన ప్రదీప్తో పరిచయం ప్రేమగా మారింది. అయితే ఆమెను కశింకోటకు చెందిన టీడీపీ నేత బుదిరెడ్డి చిన్నా బంధువు సాయి కూడా ఇష్టపడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆ యువతి, ప్రదీప్ స్నేహాన్ని జీర్ణించుకోలేకపోయాడు. గత అక్టోబరు 28న ప్రదీప్ కశింకోట వచ్చి యువతిని కలిశారు. అదను కోసం చూస్తున్న సాయి, తన మిత్రులతోపాటు మరికొంతమంది యువకులను పోగేసుకొచ్చి వచ్చి ప్రదీప్ను తీవ్రంగా కొట్టారు. స్థానికులు, మహిళలు వారించినా వినకుండా చావబాదారు.
విచక్షణ రహితంగా కొట్టిన దెబ్బలకు తట్టుకోలేని ప్రదీప్ అక్కడికక్కడే చనిపోగా, మృతదేహాన్ని శారదా నదిలో పడేస్తే కొట్టుకుపోతుందనే ఉద్దేశంతో ఉమ్మలాడ వద్ద నదిలో పడవేసి ఉంటారని భావిస్తున్నారు. బుదిరెడ్డి చిన్నా ప్రోద్బలంతోనే ఈ హత్య జరిగిందని, అతనితోపాటు హత్యకు కారకులైన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. చివరకు ప్రజల, మీడియా ఒత్తిడి పెరగడంతో పోలీసులు బుదిరెడ్డి చిన్నాతో సహా ఆరుగురిపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. పౌరులు ఆందోళన, పోరాటం చేస్తే తప్ప పాలకులు స్పందించకపోవడం శోచనీయం అని స్థానికులు వాపోతున్నారు.
ప్రేమిస్తే చంపేస్తారా?
నేను, నా భర్త దర్జీలుగా రేయింబవళ్లు కష్టపడ్డాం. రాత్రిళ్లు భోజనం చేస్తే నిద్ర వస్తుందని కడుపు మాడ్చుకుని మెలకువగా ఉండి మరీ దుస్తులు కుట్టేవాళ్లం. మేమింత కష్టపడినా ఒక్కగానొక్క కొడుకును మాత్రం దర్జాగా పెంచాం. చక్కగా చదువుకుంటున్నోడు ఇలా అర్ధంతరంగా బలైపోతాడనుకోలేదు. అయినా.. మా కొడుకు చేసిన నేరమేంటి? అనవసరంగా ఎవరితోనూ మాట్లాడడు. తన పని తాను చేసుకోవడం తప్ప ఎవరినీ ఇబ్బంది పెట్టడు. అలాంటిది ఎవరినో ప్రేమించాడట! ఆ విషయం కూడా మాకు చెప్పలేదు! ఇప్పుడే తెలిసింది.. అయినా ప్రేమిస్తే చంపేస్తారా? అంత కర్కశంగా చంపేందుకు వాళ్లకు మనసు ఎలా వచ్చింది? ‘మీ అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్న విషయం మాకిష్టం లేదు’ అని మాకు చెబితే మేమే మందలించుకునే వాళ్లం. నాలుగుకొట్టినా మా బిడ్డను మాకు అప్పజెప్పి ఉంటే మేము చూసుకునేవాళ్లం. కానీ ఏ అవకాశం ఇవ్వకుండా బిడ్డను మాకు కాకుండా చేశారే! మా ఇంటి ఆశాదీపాన్ని ఆర్పేశారే! మేము ఎవరి కోసం బతకాలి?
హంతకుల్ని కఠినంగా శిక్షించాలి!
హంతకుల్ని కఠినంగా శిక్షించాలి. ఎవరో ఎంపీలు, ఎమ్మెల్యేల బలం వాళ్లకుందని అంటున్నారు. కానీ మా కొడుకు ఆత్మకు శాంతి చేకూరాలంటే నిజమైన హంతకులకు శిక్షపడాలి. హంతకుల్ని కాపాడడానికి ప్రయత్నించిన పోలీసులనూ శిక్షించాలి. ఇలా మరో తల్లికి పుత్రశోకం లేకుండా చూడాలి. - సత్యవతి, ప్రదీప్ తల్లి
మీ కొడుక్కి ఇలా జరిగితే
మా అబ్బాయి చదివేది.. టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాసరావు వాళ్ల కాలేజి. ఇప్పుడు వాళ్లొచ్చి... కేసు గురించి మేం చూస్తామని చెబుతున్నారు. మీ కొడుక్కే ఇలా జరిగితే ఇలానే స్పందిస్తారా? కొడుకుని పెంచి ఇంతవాణ్ణి చేసింది కసాయి చేతుల్లో చావడానికా? నా కొడుకుని కర్కశంగా చంపిన వాళ్లను కఠినంగా శిక్షించడానికి న్యాయం, చట్టం ముఖం చాటేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి. మాకు దిక్కెవరు? మా అబ్బాయిని బలి తీసుకున్న రాక్షసులను శిక్షించేదెవరు? కనీసం ఎక్కడున్నాడో చెప్పమని పోలీసుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. b- రాము, ప్రదీప్ తండ్రి