విశ్రాంత జీవనం.. ఆకుపచ్చని లోకం!

Retired Bank Senior Manager in Organic cultivation - Sakshi

సేంద్రియ ఇంటిపంటల సాగులో విశ్రాంత బ్యాంక్‌ సీనియర్‌ మేనేజర్‌ మమేకం

మిద్దెపైనే పుష్కలంగా ఆకుకూరలు, కూరగాయల పెంపకం

షేడ్‌నెట్‌ నీడలో 250 కుండీలు, డ్రమ్స్, గ్రోబాగ్స్‌లో అధిక ఉత్పాదకత

సేంద్రియ ఇంటిపంటల సాగుపై హన్మకొండలో ప్రతి ఆదివారం ఉచిత శిక్షణ

వ్యవసాయంలో ఎమ్మెస్సీ చదువుకున్న గుడిపాటి జీవన్‌రెడ్డి 35 ఏళ్లు బ్యాంకు ఉద్యోగం చేసిన తర్వాత.. తన ఇంటిపైనే ఆధునిక వసతులతో సేంద్రియ ఇంటి పంటలను సాగు చేస్తున్నారు. ఇనుప చువ్వల పందిరిపై గ్రీన్‌ షేడ్‌నెట్‌ వేసి.. 250కి పైగా కుండీలు, డ్రమ్స్, గ్రోబాగ్స్‌లో 15 రకాల కూరగాయలు, ఆకుకూరలు పుష్కలంగా పండించుకొని తింటూ ఇంటిల్లపాదీ ఆరోగ్యంగా జీవిస్తున్నారు.

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ సింగాపురానికి చెందిన జీవన్‌రెడ్డి ఆంధ్రా బ్యాంక్‌లో 35 ఏళ్లు సేవలందించి సీనియర్‌ మేనేజర్‌గా రిటైరైన తర్వాత.. హన్మకొండ బ్యాంక్‌ కాలనీలో 2012లో మూడంతస్థుల ఇల్లు నిర్మించుకున్నారు. తమ ఇంటిపైనే ఆరోగ్యదాయకమైన సేంద్రియ ఆకుకూరలు, కూరగాయల సాగుకు రెండేళ్ళ క్రితం శ్రీకారం చుట్టారు.

విశ్రాంత జీవితంలో పచ్చని మొక్కలతోనే సహచర్యం చేస్తున్నారు. ఇంటిపంటల సాగు చక్కని వ్యాపకంతో పాటు రోజుకు 3 గంటల పాటు ఆనందదాయకమైన వ్యాయామంగా కూడా మారిందని ఆనందంగా చెబుతున్నారు.. కాలనీ అభివృద్ధి కమిటీ సంయుక్త కార్యదర్శిగా ఉంటూ.. నలుగురిలోనూ సేంద్రియ ఇంటిపంటల సాగుపై ఆసక్తిని రేకెత్తిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

250కి పైగా కుండీలు, డ్రమ్ములు..
మొదట్లో కొంచెం ఎక్కువ ఖర్చయినా పుష్కలంగా నిరంతరం ఆకుకూరలు, కూరగాయల దిగుబడి వచ్చేలా అత్యంత ప్రణాళికాబద్ధంగా, శాస్త్రీయంగా ఇంటిపంటలను సాగు చేస్తుండడం జీవన్‌రెడ్డి ప్రత్యేకత. ఎత్తుల వారీగా ఇనుప బెంచీలను తయారు చేయించి, వాటిపైన కుండీలను, డ్రమ్ములను ఉంచి ఆకుకూరలు, కూరగాయలు పెంచుతున్నారు. 40 కుండీల్లో టమాటాలు, 10 కుండీల్లో మిరపకాయలు, 30 కుండీల్లో వంకాయలు, 20 కుండీల్లో గోరుచిక్కుడు, 4 కుండీల్లో బంగాళదుంపలు, రెండు కుండీల్లో అల్లం సాగు చేస్తున్నారు. చిన్న కంటెయినర్లు, గ్రోబాగ్స్‌లో క్యాబేజి, కాలీఫ్లవర్‌ వేశారు.మార్కెట్‌లో దొరికే వాటర్‌ డ్రమ్ములు 15 తెచ్చి.. వాటిని నిలువుగా కోసి 30 కుండీలుగా మార్చి.. ఆకుకూరలు వేశారు.

నీరు నిలబడకుండా అదనపు నీరు కిందికి వెళ్లిపోవడం కోసం డ్రమ్ము అడుగున ఒక చిన్న బెజ్జం పెట్టి.. దానిపైన చిప్స్, గండ్ర ఇసుక వేసి దానిపైన ఎరువు కలిపిన మట్టి మిశ్రమాన్ని నింపారు. పాలకూర 4, మెంతికూర 3, గోంగూర 3, ఉల్లి కాడలు 4, కొత్తిమీర 3 డ్రమ్ముల్లో వేశారు. ఆకుకూరల విత్తనాలు వేసిన నెలరోజుల్లో కోతకు వస్తాయి. 12–15 రోజుల వ్యవధిలో విత్తనాలు వేస్తూఉండటం వల్ల ఆకుకూరలు, కూరగాయలు సంవత్సరం పొడవునా లోటు లేకుండా చేతికి అందివస్తున్నాయని జీవన్‌రెడ్డి తెలిపారు. ఉదాహరణకు.. గత అక్టోబర్‌ నుంచి ఇప్పటి వరకు టమాటా నారు 3 దఫాలుగా పోసి, మొక్కలు నాటుకున్నారు. డ్రమ్ముల్లో ప్రతి సారీ ఆకుకూర పంటల మార్పిడి పాటించడం వల్ల చక్కని పంట దిగుబడులు వస్తున్నాయన్నారు.

మట్టిలో రసాయనిక అవశేషాలతో తిప్పలు..
హైబ్రిడ్‌ విత్తనాల కన్నా సేంద్రియ సాగులో దేశీ విత్తనాలే మంచి దిగుబడినిస్తున్నాయన్నారు. రెండు ట్రాక్టర్ల ఎర్రమట్టి తెప్పించి.. సగం మట్టి, సగం వర్మీకంపోస్టు, కొబ్బరిపొట్టు, పెరిలైట్‌ కలిపి తయారు చేసుకున్న మట్టిమిశ్రమంలో జీవన్‌రెడ్డి ఇంటిపంటలు సాగు చేస్తున్నారు.  రసాయనిక ఎరువులు వాడిన పొలాల్లో మట్టి తేవడం వల్ల తొలి ఏడాది ఇంటిపంటలు సక్రమంగా రాక నీరసం వచ్చిందన్నారు. మట్టి ఆరోగ్యం బాగుపడిన తర్వాత రెండో ఏడాది పంటలు బాగా వస్తున్నాయని ఉత్సాహంగా చెప్పారు. రాలిన ఆకులు, వంటింటి వ్యర్థాలతో తయారు చేసుకునే కంపోస్టు, వేపపిండిని నెలకోసారి కొంచెం కొంచెంగా వేస్తున్నారు. 10–12 రోజులకోసారి వేపనూనె పిచికారీ చేస్తున్నారు. మొక్కలు నాటిన లేదా మొలిచిన 2–3 రోజుల్లోనే వేపనూనె చల్లితే చీడపీడల బెడద అంతగా ఉండదన్నది తన అనుభవమని తెలిపారు.

మొదట్లోనే ఆకులు తెంపెయ్యాలి..
జీవన్‌రెడ్డి మొక్కలకు రోజూ ఉదయం వేళలో స్వయంగా నీరు పోస్తుంటారు. డ్రిప్‌ ద్వారా నీరిస్తే ఐదు నిమిషాల్లో పని పూర్తవుతుందని, అయితే ఏ మొక్క ఎలా ఉందో మనకు తెలియదన్నారు. గోరుముద్దలు తినిపించే తల్లికి, బిడ్డకు మధ్య పెరిగే అనుబంధం, ఆనందం వంటిదే ఇది కూడానని జీవన్‌రెడ్డి మురిపెంగా చెప్పారు. ఉదయపు నీరెండలో అదే వ్యాయామంగా భావిస్తున్నారు.పురుగూ పుట్రా కనిపిస్తే ఏరోజుకారోజు చేతులతో ఏరేయడమే ఇంటిపంటలకు ఉత్తమ మార్గమని ఆయన అంటున్నారు.

టమాటాకు ఆకుమచ్చ(లీఫ్‌మైనర్‌) సమస్య కనిపించిన తొలిదశలోనే ఆకులను తెంపి, నాశనం చేయడం ఉత్తమం. బెండలో పేనుబంకను గమనించిన వెంటనే వేళ్లతో తీసి నేలమీద వేయాలి. గట్టి వత్తిడితో నీటిని పిచికారీ చేసినా పేనుబంక పోతుంది. అంతగా అయితే వేపనూనె పిచికారీ చేయాలన్నారు. పాలకూరను ఆశించే గొంగళిపురుగులు సాయంత్రం 5 గంటల తర్వాత మట్టిలో నుంచి బయటకు వస్తాయని, ఆ వేళలో కాచుకొని చూస్తూ పురుగులను ఏరేయాలని సూచిస్తున్నారు.

                                    హన్మకొండలో జీవన్‌రెడ్డి ఇంటిపైకనువిందు చేస్తున్న ఇంటిపంటలు

ప్రతి ఆదివారం ఉచిత శిక్షణ ఇస్తా..
బెంగళూరుకు చెందిన సేంద్రియ ఇంటిపంటల నిపుణుడు డా. విశ్వనాథ్‌ స్ఫూర్తితో నేను ఇంటిపంటల సాగుకు శ్రీకారం చుట్టాను. నాకు ఇంటిపంటల పనులు, కాలనీ అభివృద్ధి తప్ప మరే వ్యాపకమూ లేదు. గాఢమైన ఆసక్తి ఉంటే ఇంటిపంటల సాగు కష్టమనిపించదు. నాలా అందరూ ఇంత ఖర్చు పెట్టనక్కరలేదు. తక్కువ ఖర్చుతోనూ ప్రారంభించవచ్చు. మా కాలనీవాళ్లకు కూడా ఇదే చెప్తున్నాను. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మా ఇంటితోటలోనే ఉచితంగా శిక్షణ ఇవ్వదలచాను. ఆసక్తి ఉన్న వారెవరైనా ముందు నాకు ఫోన్‌ చేసి రావచ్చు. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇవ్వడానికి వాట్సాప్‌ గ్రూప్‌ను కూడా ఏర్పాటు చేశాను.
– గుడిపాటి జీవన్‌రెడ్డి (99630 99830), బ్యాంక్‌ కాలనీ, హన్మకొండ

పాడితోనే బాగుపడ్డాం..
క్రమశిక్షణతో ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే కుటుంబ నికరాదాయాన్ని పెంచుకోవడం ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని మహిళా రైతు నాగిరెడ్డి విజయగౌరి అనుభవపూర్వకంగా చెబుతున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి రూరల్‌ మండలం రాజుపేట గ్రామానికి చెందిన విజయగౌరి పెద్దగా చదువుకోకపోయినా.. పాడి పశువుల పోషణకు సంబంధించి తెలుసుకున్న ప్రతి విషయాన్నీ ఆసక్తిగా నోట్స్‌ తయారు చేసుకుంటూ.. ఆ పనిని ప్రణాళికాయుతంగా చేపడుతూ ఉత్తమ పాడి రైతుగా పలు అవార్డులు, రివార్డులను అందుకున్నారు. 18 పాడి çపశువులను పెంచుతూ రోజూ విశాఖడైరీ పాలకేంద్రానికి 80 నుంచి 100 లీటర్ల పాలు పోస్తున్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి కుటుంబాన్ని ఆర్థికాభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. ఆమె మాటల్లోనే విందాం.

‘ఎనిమిదేళ్ల క్రితం కుటుంబం ఆర్థికంగా చితికిపోవడంతో పశువుల పెంపకంపై దృష్టిసారించాను. అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన పశుక్రాంతి పథకం ద్వారా మూడు ఆవులతో డైరీ పెట్టాను. నా భర్త రామారావు సహకారంతో ప్రస్తుతం మొత్తం 15 ఆవులు 5 దూడలు పెంచుతూ పాల ఉత్పత్తి చేస్తున్నాను. రోజుకు సాధారణ స్థితిలో అయితే 80 నుంచి 100 లీటర్ల పాలు విశాఖ డైరీ పాలకేంద్రానికి అందిస్తున్నాం. పశువుల పేడతో గోబర్‌ గ్యాస్‌ తయారు చేసుకొని వాడుకుంటున్నాం. భర్తతో కలసి ఉదయం 3.30 గంటలకు నిద్ర లేచి రాత్రి 10 గంటల వరకు పనులు చేసుకుంటున్నాం. డైరీలో లీటరుకు రూ. 23, బయట రూ. 30 వస్తున్నది. పశువుల పెంపకం వలన మా కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంది. నా కుమారుడు నాగేంద్రకుమార్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. కుమార్తె యశోద ఇంజనీరింగ్‌ చదువుతున్నది’ అన్నారామె.
– రంపా రాజమోహనరావు, సాక్షి, బొబ్బిలి రూరల్‌

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌
– కొల్ల కృష్ణకుమార్, సాక్షి, హన్మకొండ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top